కొత్తకొత్తగా..

9 Jun, 2014 03:07 IST|Sakshi
కొత్తకొత్తగా..

 నవ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ తొలిసారిగా సమావేశం కాబోతోంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో జిల్లానుంచి తొమ్మిది మంది టీఆర్‌ఎస్ సభ్యు లే ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఇందులో నలుగురు మొదటి పర్యాయం ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారే. నూతన రాష్ట్రంలో సమావేశమయ్యే తొలి అసెంబ్లీ సమావేశా ల్లో పాల్గొనే అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉందని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
 
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. కేసీఆర్ కొలువులో చోటు సంపాదించుకున్న పోచారం శ్రీని వాస్‌రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎల్లారెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, గంప గోవర్ధన్ నాలుగుసార్లు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మూడుసార్లు, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఈసారి జిల్లాకు చెందిన నలుగురు తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నా రు. బాల్కొండ నుంచి ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్ నుంచి జీవన్‌రెడ్డి, బోధన్ నుంచి షకీల్, నిజామాబాద్ అర్బన్ స్థానంనుంచి గణేశ్‌గుప్తా తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరు సోమవారం ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
 
 ప్రమాణాలతోనే సరి..
 తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ సమావేశాలు సో మవారం నుంచి ఐదు రోజుల పాటు సాగనున్నాయి. గవర్నర్ ప్రసంగంతో పాటు సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎంపిక, బీఏసీలు నిర్వహించనున్నారు.
 
ఈసారి చర్చలు, సమస్యల ప్రస్తావనకు అవకాశం లేదని, తదుపరి సమావేశాల్లోనే మాట్లాడే అవకాశం రావొచ్చని ఓ ఎమ్మెల్యే తెలిపారు. ఆ సమావేశాల్లో జిల్లా సమస్యలపై చర్చిస్తామని పేర్కొన్నారు. దీంతో సభ్యులకు మాట్లాడే అవకాశం రావాలంటే మలి విడత సమావేశాల వరకు ఆగాల్సిందే. ఈ సందర్భంగా తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనబోతున్న పలువురు ఎమ్మెల్యేల అభిప్రాయాలిలా ఉన్నాయి.

మరిన్ని వార్తలు