పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

2 Jan, 2015 03:01 IST|Sakshi

వర్ని: టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల అభ్యున్నతికి తొలి ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. వర్ని మండలం శంకోరా గ్రామ పంచాయతీ పరిధిలోని ఆఫంది ఫారంలో ఆయన గురువారం ఆహారభద్రత పథకాన్ని ప్రారంభిం చారు. ఒక్కో లబ్ధిదారుడికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కొత్త సంవత్సరం తొలి రోజున నాలుగు పథకాలను ప్రభుత్వం అమలులోకి తెస్తోందని అన్నారు.

ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున కుటుంబంలో ఉన్నవారందరికీ పరిమితి లేకుండా బియ్యం అందజేయడం, పాఠశాలలు, హాస్టళ్లలో సన్నరకం బియ్యం పంపిణీ, అంగన్‌వాడీ కేంద్రాలలో గర్భిణులు, బాలింతలకు వన్ ఫుల్‌మీల్ పథకం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమవుతున్నాయన్నారు. జిల్లాలో ఆహారభద్రత పథకం కింద నెలకు 10,500 మెట్రిక్ టన్నులు, వసతి గృహాలకు 1,400 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నట్టు వివరించారు.

దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై సంవత్సరానికి రూ. రెండు వేల కోట్ల అదనపు భారం పడుతున్నా, పేదలకు కడుపు నిండా అన్నం పెట్టడానికి ఎంత ఖర్చు అయినా ప్రభుత్వం వెనుకాడబోదని స్పష్టం చేశారు. జిల్లాలో 18 లక్షల మందికి ఈ పథకాన్నివర్తింప చేసినట్టు పేర్కొన్నారు. రేషన్ డీలర్లు ఎలాంటి ఫిర్యాదు లేకుండా, తరుగు చేయకుండా లబ్ధిదారులకు బియ్యం అందజేయాలని సూచిం  చారు. వృద్ధులు, వితం తువులకు రూ. 1000, విక లాంగులకు రూ. 1500 చొప్పున 2.13 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామన్నారు.

రాష్ట్రంలో పెన్షన్ల కోసం ఏడాదికి రూ. నాలుగు వేల కోట్లు  కేటాయించామని పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నందున అర్హులు ఫించన్ రాకుండా, ఆహర భద్రత కార్డు రాకుండా ఉండకూడదన్నారు. త్వ రలోనే అర్హులకు రూ. మూడున్నర లక్షలతో ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. వీటికి పూర్తి సబ్సిడి ఉంటుందన్నారు. కొత్త కాలనీలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించండి
రైతుల రసాయనిక ఎరువుల వాడాకాన్ని తగ్గించాలని మంత్రి కోరారు. వీటిని ఎక్కువగా వాడడంతో భూసారం దెబ్బతింటోందన్నారు. సేంద్రియ ఎరువులపై దృష్టి సారించాలని కోరారు. దీంతో పెట్టుబడులు తగ్గుతాయని అన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఇటీవల పర్యటించినపుడు ఓ యువరైతు వంద ఎకరాలలో సేంద్రియ ఎరువులతో పండించడం గుర్తించామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రొనాల్డ్ రోస్, ఆర్డీఓ శ్యాంప్రసాద్‌లాల్, డీఎస్‌ఓ కొండల్‌రావు ఎంపీపీ చింగ్లీ బజ్యానాయక్, జడ్‌పీటీసీ సభ్యుడు విజయ భాస్కర్‌రెడ్డి, తహశీల్దార్ సోమేశ్వర్, ఎంపీడీఓ చందర్‌నాయక్, సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు