ఆ పత్రికకు రూ.70 కోట్లు ఇవ్వాల్సిందే

2 Jul, 2015 00:27 IST|Sakshi
ఆ పత్రికకు రూ.70 కోట్లు ఇవ్వాల్సిందే

♦ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
♦ ఏపీ వైబ్రెంట్ పేరుతో సదస్సు నిర్వహించేందుకు నిర్ణయం
♦ ఈవెంట్ నిర్వహణ బాధ్యతలు ఓ ఆంగ్ల పత్రికకు అప్పగింత
♦ కేవలం అతిథులను ఆహ్వానించినందుకు రూ.70 కోట్లు
♦ అధికారులను విస్మయపరుస్తున్న బాబు నిర్ణయం
 
 సాక్షి, హైదరాబాద్ : పెట్టుబడులను ఆకర్షించడానికి తానే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ అని నిత్యం చెప్పుకునే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పెట్టుబడులు వస్తాయో రావో తెలియని ఒక పారిశ్రామిక ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఓ ఆంగ్ల దినపత్రికకు రూ.70 కోట్లు కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. గుజరాత్ వైబ్రంట్ తరహాలో ఆంధ్రప్రదేశ్ వైబ్రెంట్ పేరుతో ఈ ఏడాది పారిశ్రామికవేత్తలతో ఈవెంట్‌ను నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు.

ఆ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను ఓ ఆంగ్ల పత్రికకు అప్పగించారు. ఇలాంటి ఈవెంట్‌కు ఎంతభారీగా నిర్వహించినా అయిదు నుంచి పది కోట్ల రూపాయలకు మించి ఖర్చుకాదని గతంలో నిర్వహించిన సంస్థలతోపాటు అధికారులు చెబుతున్నా ఆయన ఏమాత్రం పట్టించుకోవడంలేదు. తనను చూసి, తన క్రెడిబులిటీ చూసి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఆ పత్రిక అంగీకరించిందనీ, తప్పనిసరిగా రూ.70 కోట్లు కేటాయించాల్సిందేననీ అధికారులకు స్పష్టం చేశారు.

ఆ పత్రిక అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తుందని, ఇందుకు రూ.70 కోట్లు ఇవ్వడంలో తప్పులేదని సీఎం సమర్ధించుకుంటున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇంతకూ ఆ పత్రిక చేసేది ఈవెంట్‌కు పారిశ్రామికవేత్తలను, అతిధులను ఆహ్వానించడం, మీడియాలో ప్రచారం కల్పించడం, మీడియా మేనేజ్‌మెంట్ వంటివి మాత్రమే. రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు, అతిథులకు స్టార్ హోటళ్లలో బస, సౌకర్యాలు కల్పనతోపాటు ఈవెంట్ నిర్వహణకయ్యే ఇతర వ్యయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.

మరో విషయమేమంటే... ఈవెంట్‌కు వచ్చే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడతారా లేదా అన్న అంశంతో కూడా నిర్వాహకులకు ఏమాత్రం సంబంధం ఉండదు. ఈమాత్రం పనికి రూ.70 కోట్లు చెల్లించడానికి చంద్రబాబు సిద్ధపడటమంటే తెరవెనుక మతలబు వేరే ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రచారం కోసం కాకుండా పెట్టుబడుల కోసం పనిచేయడంవల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నకాలంలో ఇలాంటి కోవలోనే భాగస్వామ్య సదస్సు పేరుతో ఏకంగా రూ.70 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి అవగాహన కుదుర్చుకున్నారని, కానీ ఆ తర్వాత వాటిల్లో పైసా పెట్టుబడి రాష్ట్రానికి రాలేదని అధికారులు గుర్తుచేస్తున్నారు.

మరిన్ని వార్తలు