డబ్బాల తొలగింపుతో ఉద్రిక్తత

24 Aug, 2015 03:16 IST|Sakshi
డబ్బాల తొలగింపుతో ఉద్రిక్తత

♦ ఆర్టీసీ అధికారులతో యజమానుల వాగ్వాదం
♦ పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన పరిస్థితి
 
 చేవెళ్ల : మండల కేంద్రంలోని బస్‌స్టేషన్ ఎదుట హైదరాబాద్-బీజాపూర్ ప్రధాన రహదారిపై ఉన్న డబ్బాలు, చిరువ్యాపారుల తోపుడుబండ్లను ఆదివారం ఆర్టీసీ అధికారులు తొలగిం చారు. వారితో దుకాణా యజమానులు వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. వివరాలిలా ఉన్నాయి. సుమారు ఐదేళ్లక్రితం చేవెళ్ల బస్‌స్టేషన్ ఆవరణలో ఆర్టీసీ అధికారులు దుకాణాల సముదాయం నిర్మించారు. వీటికి టెండర్లు పిలిచి కొందరికి దుకాణాలు కేటాయించారు. అయితే వాటి ఎదుటే ఎన్నో ఏళ్లుగా డబ్బాలు, తోపుడు బండ్లను పెట్టుకుని పండ్లు, పూలు, కొబ్బరిబొండాం, టిఫిన్‌సెంటర్, చెప్పులు కుట్టేవారు తదితర చిరువ్యాపారులు వ్యాపారం చేసుకుంటున్నారు.

బస్సులు నిలపడానికి స్థ లంలేకపోవడంతో రోడ్డుపైనే నిలపడం, హైదరాబాద్-బీజాపూర్ రహదారికి బస్‌స్టేషన్ ఆనుకునే ఉండ టంతో ఇక్కడి నుంచి డబ్బాలను ఖాళీ చేయాలని యజమానులకు ఆర్టీసీ అధికారులు కొన్ని నెలలక్రితం నోటీసులిచ్చినా పట్టిం చుకోలేదు. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మిం చిన దుకాణాల సముదాయం నిరుపయోగంగా ఉంది. అలాగే ఇటీవల రాష్ర్ట రవాణా మంత్రి పి.మహేందర్‌రెడ్డి తాండూరుకు వెళ్లే సమయంలో బస్సులు స్టేషన్‌లోకి వెళ్లడానికి స్థలంలేక కాన్వాయ్‌కు అడ్డంగా నిలిపారని పోలీసు లు ఆర్టీసీ డ్రైవర్లకు జరిమానా విధించారు.

అంతేగాక బస్‌స్టేషన్ ఎదుట ప్రధాన రహదారికి ఆనుకుని వీటిని ఏర్పాటు చేసుకోవడంతో నిత్యం ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతున్నాయి. చివరకు ఆదివారం ఉదయం పోలీసు ల బందోస్తు మధ్య జేసీబీ సాయంతో వాటిని తొలగించారు. ఈ కార్యక్రమాన్ని వికారాబాద్ ఇన్‌చార్జి డీఎం రాఘవేందర్‌రెడ్డి, డిప్యూటీ సీటీఎం విజయభాను పర్యవేక్షించారు. దీంతో అధికారులతో డబ్బా యజ మానులు కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. సీపీఐ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి కె.రామస్వా మి, బీజేపీ మం డల మాజీ అధ్యక్షుడు ఎ.శ్రీ నివాస్ తదితరులు మాట్లాడుతూ చిరువ్యాపారులకు ప్రత్యామ్నా యం చూపించాలని డిమాండ్ చేశారు.
 
 35ఏళ్లుగా పూల వ్యాపారం
 35ఏళ్లుగా బస్‌స్టేషన్ ముందు పూల వ్యాపారం చేసుకుంటున్నా. తాత్కాలికంగా కట్టెలతో చిన్న షెడ్ వేసుకుని పూలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. అధికారులు నిర్దాక్షిణ్యంగా వీటిని తొలగించారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్లాలి. ఎక్కడైనా స్థలం కొందామన్నా వేలకువేలు పెట్టినా గజం భూమికూడా దొరికే పరిస్థితిలేదు. ఏంచేయాలో తోచడంలేదు.
 - సీతారాం, పూల వ్యాపారి, చేవెళ్ల
 
 కుటుంబాన్ని ఎలా పోషించాలి
 ఎన్నో ఏళ్లనుంచి బస్‌స్టేషన్ వద్ద పండ్లు అమ్ముకుంటున్నాను. నాకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. భర్త గ్రామాల్లో తిరిగి పాత ఇనుప సామాను కొంటాడు. ఇప్పుడు తోపుడుబండిని తొలగిస్తే మేము ఏం చేసుకుని బతకాలి. ప్రభుత్వమే ఏదో ఒకచోట స్థలం చూపించాలి. లేకుంటే బతకడమే కష్టమవుతుంది.
 - జాహేదా, పండ్ల వ్యాపారి, చేవెళ్ల

మరిన్ని వార్తలు