అసెంబ్లీలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక నిధులు ఇవ్వడం వల్ల ఖమ్మంలో ఎంతో అభివృద్ధి సాధించగలిగామని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. తెలంగాణ మున్సిపల్ చట్టం–2019 బిల్లుపై అసెంబ్లీలో శుక్రవారం జరిగిన చర్చలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఖమ్మం మున్సిపాలిటీగా ఉన్న క్రమంలో కేవలం 4 నుంచి 6 కోట్ల రూపాయాలు మాత్రమే బడ్జెట్ ఉండేదని, ప్రస్తుతం వరంగల్కి రూ.300 కోట్లు, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, రామకుండంకు రూ.100 కోట్లు ముఖ్యమంత్రి నిధులు ఇస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఖమ్మంలో 98శాతం పన్నులు సకాలంలో చెల్లిస్తున్నారని తెలిపారు. అవినీతిని పారదోలేందుకు యునిఫైడ్ చట్టం తీసుకొచ్చారని, దాన్నినేడు అమలు పర్చటం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కార్పోరేషన్లకు ప్రతి ఏటా రూ.100 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేసుకునే వేసులుబాటు ప్రభుత్వం కల్పించిందన్నారు. నగరంలో రోడ్లు విస్తరించి, డ్రైయిన్లు నిర్మించడానికే స్థలం సరిపోతుందని, చెట్లు వేసేందుకు స్థలం లేకుండాపోయిందన్నారు. గ్రామాల్లో అయినా ఈ కార్యక్రమం చేద్దామంటే హరితహారం బాధ్యులు సరిగ్గా లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందన్నారు.
తమతమ ప్రాంతాల్లో కనీసం 85శాతం ప్లాంటేషన్ నిర్వహిస్తేనే తమ పదవులు ఉంటాయని హెచ్చరించడం మంచి పరిణామమన్నారు. ప్రజలకు మేలు జరగాలంటే మున్సిపల్ చట్టంలో మార్పులు తీసుకొచ్చి పారదర్శకతగా మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. గ్రామాల నుంచి ప్రజలు తమ పిల్లల చదువులు, ఉద్యోగాలు, వివిధ కారణాలతో ప్రజలు నగరాలకు చేరుతున్నారని, అందుకే నగరాలు, అర్బనైజేషన్ విస్తరించాల్సి ఉందని అన్నారు. మున్సిపాలీటిలకు పెడ అర్థం వచ్చేలా మారిందని అందుకే చట్టం సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మున్సిపాలిటీల్లో ఇంటి పర్మిషన్, లే అవుట్ అఫ్రువల్ తదితర పనుల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, పారదర్శకత కోసం ఈ చట్టం రూపొందించడం అభినందనీయమన్నారు. ప్రతి పౌరుడు తాను ఇచ్చే సెల్ఫ్ డిక్లరేషన్ తన బాధ్యతను గుర్తు చేస్తుందన్నారు. జి ప్లస్ వన్ వరకు 75 గజాలు లోపు జరిగే నిర్మాణాలకు పర్మిషన్ అవసరం లేదని, వారికి కేవలం నామమాత్రంగా రూ.100 పన్ను విధించడం విప్లవాత్మక నిర్ణయమన్నారు. నగరాలను, పట్టణాలను పీడిస్తున్న సమస్యలను అధిగమించాలంటే కొన్ని కఠిన మార్పులు చేయక తప్పదన్నారు.