‘కృష్ణా’పై సమన్వయ భేటీ లేనట్లే!

13 Jul, 2017 00:54 IST|Sakshi
‘కృష్ణా’పై సమన్వయ భేటీ లేనట్లే!

పాత వాటా ప్రకారమే నీటిని వాడుకోవాలని కేంద్రం సూచన
► ఇప్పటికే కేంద్ర జల వనరుల శాఖ సంయుక్త కార్యదర్శి లేఖ
► ఇరురాష్ట్రాలూ అంగీకరించే అవకాశం


సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదీ జలాల విని యోగానికి సంబంధించి తెలంగాణ, ఏపీ మధ్య ఏటా నిర్వహించే సమన్వయ సమావే శాలకు ఈ ఏడాది కేంద్ర జల వనరుల శాఖ స్వస్తి చెప్పినట్లు కనిపిస్తోంది. కృష్ణా వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌–1 కేటాయించిన వాటా ల మేరకే ఈ ఏడాది కూడా నీటిని వాడుకో వాలన్న దిశానిర్దేశంతోనే సరిపెట్టే అవకాశాలు న్నాయి. దీనిపై ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసిన కేంద్ర జల వనరుల శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్‌ కుందు.. గతంలో మాదిరే 512ః299 నిష్పత్తిన నీటిని పంచుకునే అంశమై తమ అభిప్రాయాలు తెలిపాలని కోరారు. దీనికి ఇరు రాష్ట్రాలు ఓకే చెబితే సమన్వయ సమావేశం ఏదీ ఉండనట్లే.

నిజానికి కృష్ణా జలాలపై రెండు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు ఉన్నా ఒక్కదానికీ  పరిష్కారం దొరకడం లేదు. ఏటా జూన్‌లో ఇరురాష్ట్రాలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్న కేంద్రం.. చాలా అంశాలపై ఇరురాష్ట్రాల మధ్య తాత్కాలిక సయోధ్య కుదురుస్తూ వస్తోంది.అయితే ఈ ఏడాది ఇంతవరకు సమావేశాల ఊసే ఎత్తలేదు. మరోవైపు పట్టిసీమ సహా దిగువ ప్రాజెక్టులకు నీటి విడుదల, ప్రాజెక్టుల నియంత్రణ అంశాల మధ్య ఇరురాష్ట్రాల మధ్య లేఖల యుద్ధం జరుగుతూనే ఉంది. కొన్ని సంద ర్భాల్లో బోర్డులు సైతం తేల్చలేక కేంద్రానికి ఫిర్యాదు చేసి ఊరుకుంటున్నాయి.

అంటీము ట్టనట్టుగానే వ్యవహరిస్తున్న కేంద్రం.. ఇటీవల ఇరు రాష్ట్రాలకు ఓ లేఖ రాసింది. గతంలో మాదిరే నీటిని వాడుకునే అంశంపై అభిప్రా యాలు కోరింది. దీనికి తెలంగాణ కొంత సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. తన వాటా 299 టీఎంసీల నీటిని రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా వాడుకునే అవకాశం ఇస్తే అందుకు అంగీకారం తెలిపే అవకాశం ఉంది. అయితే పట్టిసీమ నుంచి ఏపీ ఈ ఏడాది సైతం గరిష్ట నీటిని తీసుకునే యత్నాలకు దిగిన నేపథ్యం లో అందులో వాటా కోరుతుందా, అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఏపీ తన వాటా 512 టీఎంసీల మేర ఉన్నందున కేంద్ర ప్రతిపాదనకు ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువ. రెండు రాష్ట్రాలు ఓకే చెప్పిన పక్షంలో కేంద్రం దానికి అనుగుణంగా ఓ ఆర్డర్‌ వెలువరించి ఊరుకునే అవకాశం ఉంది.

కృష్ణాలో తగ్గిన ప్రవాహాలు..
కృష్ణా బేసిన్‌లోని ఎగువ ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు తగ్గాయి. ప్రస్తుతం అక్కడ 129 టీఎంసీల నిల్వకుగానూ 44 టీఎంసీల లభ్యత ఉంది. ఇక తుంగభద్రకు స్ధిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. బుధవారం 8,200 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తుండటంతో అక్కడ 100 టీఎంసీలకు గానూ 13.46 టీఎంసీల లభ్యత ఉంది. నాగార్జున సాగర్‌లో ఏకంగా 501 అడుగుల కనిష్ట మట్టానికి నీటి నిల్వలు పడిపోయాయి.

>
మరిన్ని వార్తలు