కౌంటింగ్‌పై అవగాహన ఉండాలి 

28 Nov, 2018 11:36 IST|Sakshi
మాట్లాడుతున్న కలెక్టర్‌ హనుమంతరావు

కలెక్టర్‌ హనుమంతరావు ఎన్నికల సిబ్బందికి శిక్షణ  

సంగారెడ్డిజోన్‌: కౌంటింగ్‌ ప్రక్రియపై పూర్తి అవగాహన, పట్టు కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.హనుమంతరావు తెలిపారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కౌంటింగ్‌ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ హనుమంతరావు మాట్లాడుతూ.. కౌంటింగ్‌ హాలులో ఉండే ఏర్పాట్లు, కౌంటింగ్‌ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులు, జాగ్రత్తలు తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారు.

రాజకీయ పార్టీల ఏజెంట్లకు నమ్మకం కలిగించాలని, ఓపిగ్గా ఉండాలన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొదటగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించాల్సి ఉంటుందన్నారు. లెక్కింపు రౌండ్స్‌ వారీగా జరుగుతుం దని,  పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని, పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. పూర్తిస్థాయిలో శిక్షణ పొంది ఏవైనా సందేహాలున్నట్లయితే నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలన్నారు.

వందశాతం ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. తహసీల్దార్‌ పరమేశ్వర్‌ కౌంటింగ్‌ ప్రక్రియలోని అన్ని అంశాలను క్షుణ్నంగా వివరించారు. ఈవీఎంలలో ఏదైనా సమస్య తలెత్తితే పరిష్కరించడానికి బెల్‌ ఇంజినీర్లు అందుబాటులో ఉంటారని, ఆందో ళనకు గురికావద్దని అన్నారు. అబ్జర్వర్లు ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలిస్తారని, ప్రతి చో ట క్రాస్‌ చెక్‌ చేయడం జరుగుతుందన్నారు. ఎలాంటి సందేహాలున్నా శిక్షణలో  నివృత్తి చేసుకోవాలన్నారు. అనంతరం కౌంటింగ్‌ ప్రక్రియ, ఈవీఎంలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో 60 మంది సిబ్బంది పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు