నల్లాల ద్వారా కరోనా రాదు..

3 Apr, 2020 05:50 IST|Sakshi

నీటి పైపుల ద్వారా వైరస్‌ సంక్రమించే అవకాశం లేదన్న డబ్ల్యూహెచ్‌వో

సాక్షి, హైదరాబాద్‌: ‘తాగునీటి పైపుల ద్వారా కరోనా వైరస్‌ సంక్రమిస్తుంది. ప్రజలెవ్వరూ నల్లాల్లో వచ్చే నీటిని తాగొద్దు. ఇతర పనులకు కూడా వినియోగించుకోవద్దు.’ఇజ్రాయెల్‌ నుంచి సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న తప్పు డు ప్రచారమిది. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తప్పుపట్టింది. నీటి పైపుల ద్వారా ఈ వైరస్‌ సంక్రమిస్తుందనడానికి  శాస్త్రీయ ఆధారాల్లేవని తేల్చి చెప్పింది. ప్రపంచంలోని ఏ దేశ ప్రజలూ తాగునీటి విషయంలో ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేసింది. ఇజ్రాయెల్‌లో నమోదవుతున్న కరోనా బాధితుల సంఖ్యకు, తాగునీటికి సంబంధం లేదని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి తారిఖ్‌ లాజరెవిచ్‌ వెల్లడించారు. కేవలం మనిషిని ఇంకో మనిషి తాకడం ద్వారా మాత్రమే ఈ వైరస్‌ వ్యాపిస్తుందే తప్ప.. గాలిలో ప్రయాణం చేసేంత తేలికపాటిది కాదన్నారు. కనీసం మనిషికి మనిషికి మధ్య మీటర్‌ దూరం పాటించడం, ముఖ భాగాలను తాకకపోవడం వల్లే కరోనా వైరస్‌ను నియంత్రిస్తాయని, అందరూ ఈ భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు వ్యక్తిగత, పరిశుభ్రతను అలవాటు చేసుకోవాలంది.

మరిన్ని వార్తలు