టీసీలు, మెమోలు ఇవ్వరట!

23 Jun, 2018 14:37 IST|Sakshi

ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు

జనగామ అర్బన్‌: జిల్లాలోని కొన్ని మోడల్‌ స్కూళ్లలో పదో తరగతి చదివిన విద్యార్థుల కు అధికారులు టీసీలు, మెమోలు ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పది  ఫలితాలు వెలువడి దాదాపు నెల రోజలు అవుతోంది. ఇంటర్‌ మొదటి సంవత్సరం తరగతులు సైతం ప్రారంభమై 20 రోజులు కావస్తోంది. జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో మొత్తం 9 మోడల్‌ స్కూళ్లు ఉన్నాయి.

ఇందులో 8 స్కూళ్లలో ఇంటర్‌ కోర్సు ఉంది. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో దాదాపు 500 మం ది విద్యార్థులకు అవకాశం ఉంటుంది. అయి తే మోడల్‌ స్కూల్‌లో ఆరు నుంచి పదో తరగతి వరకు చదివిన విద్యార్థులను ఇంటర్‌ సైతం ఇక్కడే చదవాలని కొందరు ఆంక్షలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. కళాశాలల్లో చేరే అంశం విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థి తి, విద్యార్థుల ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుంది.

కానీ, వేరే కళాశాలల్లో చేరేందుకు టీసీ, మెమోలు ఇచ్చేది మాత్రం లేదని అధికారులు పేర్కొంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరో వైపు హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ కళాశాలల్లో చేరే విద్యార్థులకు మాత్రం టీసీ, మెమోలు ఇస్తున్నారని పలు విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరికొన్ని పాఠశాలల అధికారులు పదో తరగతి పాసై న విద్యార్థి టీసీ అడిగితే అందులో విద్యను అభ్యసిస్తున్న వారి తమ్ముడు, చెల్లి టీసీలు కూడా ఇస్తామని ఒకింత కఠినంగా చెబుతున్నారని తెలుస్తోంది.

మోడల్‌ స్కూల్‌లో బో«ధించే కొందరు ఉపాధ్యాయుల పిల్లలు మాత్రం కార్పొరేట్‌ విద్యను అభ్యసిస్తున్నార ని, వారేందుకు మోడల్‌ స్కూల్‌లో అడ్మిషన్‌ తీసుకోలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులకు ఇష్టంలేని చోట విద్య కొనసాగదని, భవిష్యత్‌ భరోసా ఎవరిస్తారని పలు వురు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులు ఇష్టంతో చేరే విధంగా అధికారులు చర్యలు తీసుకో వాలని, ఇష్టంలేకున్నా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం తగదంటున్నారు.

ఇప్పటికైనా మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ చదవడం ఇష్టంలేని విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయొద్దని టీసీ, మెమోలు జారీ చేయాలని విద్యార్థి సంఘాల బాధ్యులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. కాగా, నాణ్యమైన వి ద్య అందుతుందనే దృష్టితోనే విద్యార్థులను మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌లో చేరే విధంగా అధికారులు కృషి చేస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇష్టంలేకపోవడంతోనే సమస్యలు తలెత్తుతున్నట్లు సమాచారం.  
 

మరిన్ని వార్తలు