అదను చూసి దోచుకుపోయారు..

5 Aug, 2015 18:42 IST|Sakshi

నాగర్‌కర్నూల్ (మహబూబ్‌నగర్): ఒంటరిగా మహిళ ఇంట్లో ఉన్న విషయాన్ని పసిగట్టిన దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఆమెను బెదిరించి నగలు, నగదు దోచుకున్నారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్‌లో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు.. నాగపూర్‌కు చెందిన రాజేందర్‌రెడ్డి, చందన దంపతులు పట్టణంలోని ఎర్రగడ్డ కాలనీలోని ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. రాజేందర్‌రెడ్డి పారాబాయిల్డ్ మిల్లులో గుమస్తాగా పనిచేస్తాడు. రోజు మాదిరిగానే ఉదయం 10 గంటలకు విధులకు వెళ్లిన సమయంలో చందన ఇంటికి గడియ పెట్టి స్నానానికి వెళ్లింది.

అదే సమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. చందన తిరిగి వచ్చి చూసే సరికి అగంతకులు ఇంట్లోని వస్తువులను చిందరవందర చేస్తున్నారు. ఆమెను గమనించిన దుండగులు వెంటనే అరవకుండా నోటిని బలంగా మూసివేశారు. అనంతరం దుండగులు ఇంట్లో ఉన్న దాదాపు రూ.3 లక్షల నగదు, చందన మెడలోని రెండున్నర తులాల పుస్తెల తాడును లాక్కునిపోయారు. చుట్టు పక్కల వారు కొద్ది సేపటి తర్వాత గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

మరిన్ని వార్తలు