రంగారెడ్డి జిల్లాలో దొంగల బీభత్సం

14 Mar, 2014 03:30 IST|Sakshi

30 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.50 వేల నగదు అపహరణ
 శంషాబాద్, న్యూస్‌లైన్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండలో బుధవారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కత్తులతో బెదిరించి, భారీచోరీకి పాల్పడ్డారు. 30తులాల బంగారం, 20తులాల వెండితో పాటు, రూ.50 వేల ను ఎత్తుకెళ్లారు. పెద్దగోల్కొండలో దేవయ్యగౌడ్  ఇంట్లో నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. దేవయ్య, ఆయన భార్యాపిల్లలు నిద్రిస్తున్న గదులకు గడియలు వేసుకోకపోవడంతో దుండగులు అందులోకి ప్రవేశిం చారు. అలికిడి వారంతా నిద్రలేచి కేకలు వేసే యత్నం చేయగా కత్తిచూపించి.. అరిస్తే చంపేస్తామని బెదిరించారు.
 
  బీరువాలో ఉన్న రూ.50 వేల నగదుతోపాటు చంద్రకళతోపాటు ఆమె కూతుళ్ల మెడల్లో ఉన్న సుమారు 30 తులాల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలను లాక్కున్నారు. వెళ్లేటప్పుడు దేవయ్య చేతులను కర్టెన్‌తో వెనక్కి కట్టేసి ఓ గదిలో బంధిం చారు. చంద్రకళ, ఆమె కుమార్తెలను మరో గదిలో తోసేశారు. బయటి నుంచి తలుపులకు గడియ వేసి పరారయ్యారు. ఈ తతంగం అంతా కేవలం 15 నిమిషాల్లోనే పూర్తయింది. చోరీకి ముందు సమీపంలోని రెండిళ్లకు దుండగులు బయట నుంచి గడియలు పెట్టారు.  శంషాబాద్ డీసీపీ రమేష్‌నాయుడు, ఏసీపీ సుదర్శన్, ఎస్‌వోటీ డీసీపీ నర్సింగ్‌రావు ఘటనా స్థలాన్ని సందర్శించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు