ఆధార్‌ సేవల్లో రాష్ట్రానికి మూడో స్థానం

8 Jul, 2018 01:01 IST|Sakshi

అవార్డులు ప్రకటించిన యూఐడీఏఐ

సాక్షి, హైదరాబాద్‌: అత్యంత వేగంగా ఆధార్‌ నమోదు చేసినందుకు గానూ తెలంగాణ పోస్టల్‌ సర్కిల్‌ దేశంలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇదే విభాగంలో పంజాబ్, బిహార్‌ పోస్టల్‌ సర్కిల్స్‌ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ) ‘ఆధార్‌ ఎక్సలెన్సీ అవార్డ్స్‌ృ2018’పేరిట మూడు విభాగాల్లో 66 అవార్డులను ప్రకటించింది. ఢిల్లీలోని ఇండియా హ్యాబిటేట్‌ సెంటర్‌లో బుధవారం జరగనున్న కార్యక్రమంలో తెలంగాణ పోస్టల్‌ సర్కిల్‌ నుంచి చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ బి.చంద్రశేఖర్‌ ఈ అవార్డును అందుకోనున్నారు.

అలాగే ‘బెస్ట్‌ పెర్ఫామింగ్‌ పోస్టుఆఫీసు ఇన్‌ ఏ పోస్టల్‌ రీజియన్‌’కేటగిరీలో హైదరాబాద్‌ సిటీ రీజియన్‌ నుంచి సికింద్రాబాద్‌ ప్రధాన పోస్టాఫీసు కార్యాలయం పోస్టుమాస్టర్‌ బి.ప్రసాదరావు, హైదరాబాద్‌ రీజియన్‌ నుంచి ఇదే విభాగంలో హన్మకొండ పోస్టాఫీసు ప్రధాన కార్యాలయ పోస్టుమాస్టర్‌ కె.సంపత్‌లు అవార్డులు అందుకోనున్నారు. తెలంగాణలో 266 పోస్టాఫీసులు, ఆంధ్రప్రదేశ్‌లో 578 పోస్టాఫీసులు, ఒడిశాలో 473 పోస్టాఫీసులు, ఛత్తీస్‌గఢ్‌లో 161 పోస్టాఫీసుల్లో ఆధార్‌ నమోదు కార్యకలాపాలు సాగుతున్నాయని యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ జి.వేణుగోపాల్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా 14 వేల పోస్టాఫీసుల్లో ఆధార్‌ నమోదు సేవలందిస్తున్నామని, ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోస్టాఫీసులకు అవార్డులు ప్రకటించామని చెప్పారు.  

ఏపీకి మూడు అవార్డులు.. 
‘బెస్ట్‌ పెర్ఫామింగ్‌ పోస్టు ఆఫీసు’ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు మూడు అవార్డులు దక్కాయి. కడప పోస్టాఫీసు ప్రధాన కార్యాలయ పోస్టుమాస్టర్‌ జె.సుబ్బారాయుడు, విజయవాడ పోస్టాఫీసు ప్రధాన కార్యాలయ పోస్టుమాస్టర్‌ కె.కనక రత్నారావు, విశాఖపట్నం పోస్టాఫీసు ప్రధాన కార్యాలయ పోస్టుమాస్టర్‌ ఆర్‌.గణేశ్‌కుమార్‌లు ఈ అవార్డులు అందు కోనున్నారు. బెస్ట్‌ పెర్ఫామింగ్‌ పోస్టల్‌ సర్కిల్‌లో మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్‌ రాష్ట్రాలు అవార్డులను దక్కించుకున్నాయి.

మరిన్ని వార్తలు