పదమూడు మందికి కరోనా పాజిటివ్‌

6 Jul, 2020 10:22 IST|Sakshi

ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న కేసుల సంఖ్య

మహమ్మారి బారిన పడి ఇద్దరి మృత్యువాత

కొండమల్లేపల్లి (దేవరకొండ) : ఉమ్మడి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా ఆదివారం మరో పదమూడు మంది వైరస్‌ బారిన పడగా, మరో ఇద్దరు మృతిచెందారు. కొండమల్లేపల్లి మండల పరిధిలో మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అ యినట్లు మండల వైద్యాధికారి జమున ఆదివారం తెలి పారు. మండల పరిధిలో ఇప్పటి వరకు ఐదు పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ విధిగా మాస్క్‌లు ధరించాలని వైద్యులు సూచించారు.

మిర్యాలగూడ మండలంలో ఒకరికి..
మిర్యాలగూడ : మండలంలోని తక్కెళ్లపాడు  పంచాయతీ పరిధిలోని నర్సింహులగూడెంలో ఒక వ్యక్తికి ఆదివారం కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారించినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కేసా రవి తెలిపారు. గతంలో ఆ గ్రామంలో కరోనా పాజిటివ్‌ ఉన్న వారితో కాంటాక్ట్‌ ఉన్నందున పరీక్షలు నిర్వహించగా అతడికి కూడా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. ఆయనను హోం క్వారెంటెన్‌లో ఉంచినట్లు తెలిపారు. 

చిట్యాలలో ఇద్దరికి..
చిట్యాల(నకిరేకల్‌):  చిట్యాల మండల పరిధిలో ఆదివారం రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. చిట్యాల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఆరోగ్య పరీక్షలకు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లగా అక్కడ చేసిన పరీక్షల్లో కోవిడ్‌ పాజిటివ్‌ కేసుగా నిర్ధారణ కావడంతో ఆయన అక్కడే చికిత్స పొందుతున్నాడు. మండలంలోని వనిపాకల గ్రామానికి చెందిన ఓ యువకుడు వృత్తిరీత్యా హైదరాబాద్‌లో పనిచేస్తుండగా అతడికి వైరస్‌ సోకగా జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కరోనాతో మహిళ మృతి
చండూరు /మునుగోడు:  కరోనా మహమ్మారి బారిన పడి న ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన మండల పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మండలంలోని తేరట్‌పల్లి  గ్రామానికి చెందిన యువతిని మునుగోడు మండలం కొరటికల్‌ గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివా హం జరిపించారు. సంతోష ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతోంది. నాలుగు నెలలుగా తేరట్‌పల్లి గ్రామంలోనే ఉంటోంది. 15 రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే కరోనా ఆనవాళ్లు కనిపిస్తుండడంతో గాంధీ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందింది. మృతిచెందిన మహిళను పరామర్శించిన వారిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. ముందస్తుగానే సర్పంచు వీరమళ్ల శ్రీశైలం గ్రామంలో పరిశుభ్రతపై చర్యలు తీసుకున్నారు. 

అంత్యక్రియలకు నిరాకరించిన గ్రామస్తులు...
కరోనాతో మృతిచెందిన ఆ మహిళ అంత్యక్రియలు కొరటికల్‌ గ్రామంలో చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ భూమి వద్ద మృతదేహాన్ని ఉంచి అక్కడే దహనం చేసేలా ఏర్పాట్లు చేసుకుంటామని అధికారులని, పోలీసులని కోరగా అందుకు ఒప్పుకున్నారు. కానీ గ్రామ ప్రజలు మాత్రం మృతదేహాన్ని గ్రామానికి తీసుకురావద్దన్నారు. దీంతో చేసేదేమీలేక మృతురాలి కుటుంబ సభ్యులు హైదరబాద్‌లోనే ఆమె అంత్యక్రియలు చేయించారు. 

ఆత్మకూరు(ఎం)లో ఒకరికి..
ఆత్మకూరు(ఎం)(ఆలేరు) : మండల కేంద్రంలోని రామ్‌నగర్‌లో నివాసముంటున్న ఒకరికి కరోనా పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. కరోనా వచ్చిన వ్యక్తి దేవరకొండలో ఎలక్రీ్టషియన్‌గా పని చేస్తుంటాడు. ప్రస్తుతం ఆత్మకూరు(ఎం)లో ఇంట్లోనే ఉంటున్నాడు.  ఇటీవల జ్వరం తీవ్రంగా రావడంతో అతని నుంచి డాక్టర్లు శాంపిల్స్‌ సేకరించారు. ఆదివారం కరోనా పాజిటివ్‌ వచ్చినట్లుగా వైద్యాధికారి ప్రణీష తెలిపారు. ప్రైమరి కాంట్రాక్టుగా ముగ్గురిని, సెకండ్‌ కాంట్రాక్ట్‌గా అయిదుగురుని గుర్తించారు. ప్రస్తుతం అందరిని హోంక్వారంటైన్‌లోనే ఉంచారు.  కరోనా వచ్చిన ఇంటికి ఇంటికి సమీప ప్రాంతంలో పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారు. తహసీల్దార్‌ పి. జ్యోతి, ఆర్‌ఐ చిప్పలపెల్లి యాదగిరి, సర్పంచ్‌ జెన్నాయికోడె నగేష్‌ పరిసరాలను పరిశీలించారు. 

పట్టణంలో ఒకరికి కరోనా..
నల్లగొండ టౌన్‌:  నల్లగొండ పట్టణంలోని ఎస్‌ఎల్‌బీసీ కాలనీకి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చినట్లు జిల్లా సర్వేలెన్‌ అధికారి డాక్టర్‌ రాహుల్‌ ఆదివారం తెలి పారు. పట్టణంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 8 మందికి కరోనా పాజిటివ్‌ రాగా ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ వచ్చిన సంఖ్య 101 కి చేరినట్లు ఆయన తెలిపారు. అందులో కరోనాతో నలుగురు వ్యక్తులు మృతి చెందారని తెలిపారు. 

కరోనాతో వృద్ధురాలి మృతి
నల్లగొండ క్రైం: కరోనాతో హాలియా పట్టణానికి చెందిన వృద్ధురాలు చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది.హాలియాలోని ఎరుకల బజార్‌కు చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు శుక్రవారం అనారోగ్యంతో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చెరింది. దగ్గు,ఆయాసం,గుండె నొప్పితో బాధపడింది. శనివారం రాత్రి వృద్ధురాలు మృతి చెందగా కరోనా పరీక్ష నివేదిక ఆదివారం పాజిటివ్‌గా వచ్చింది.దీనితో కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించలేదని ఎస్సై నర్సింహులు తెలిపారు.

కొప్పోలులో ఒకరికి..
గుర్రంపోడు (నాగార్జునసాగర్‌) : మండలంలోని కొప్పోలులో  యువకుడికి కరోనా సోకినట్లు ఆదివారం  మండల వైద్యాధికారి నవనీత ధ్రువీకరించారు. ఈ యువకుడు అనుమానంతో కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా వచ్చింది. దీంతో యువకుడిని çనల్లగొండకు పంపించారు. 

పీఏపల్లి మండలంలో ఇద్దరికి..
పెద్దఅడిశర్లపల్లి (దేవరకొండ) :  పెద్దఅడిశర్లపల్లి మండలంలో ఇద్దరికి కరోనా సోకింది. మండలంలోని అజ్మాపురం గ్రామపంచాయతీ పరిధిలోని కొట్టాలగడ్డకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు  వైద్యాధికారి సత్యనారాయణ తెలిపారు.గత సోమవారం సదరు వ్యక్తి డయాలసిస్‌ చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రిలో చేరారు.శుక్రవారం ఆస్పత్రి సిబ్బంది అతడికి కరోనా పరిక్ష నిర్వహించగా   కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అతడిని  గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.తన కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్‌లో ఉంచినట్లు తెలిపారు. 

అయిటిపాములలో యువకుడికి..
కట్టంగూర్‌ :  మండలంలోని అయిటిపాముల గ్రామానికి చెందిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ప్రాథమిక వైద్యాధికారి నాగలక్ష్మి ఆదివారం తెలిపారు. గ్రామానికి చెందిన యువకుడు  వారం రోజులుగా జలుబు, దగ్గుతో కూడిన జ్వరంతో బాధపడుతుండగా వైద్య సిబ్బంది అనుమానంనతో శాంపిల్స్‌ను రెండు రోజుల క్రితం టెస్ట్‌కు పంపగా కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఆమె తెలిపారు.  

మేడారంలో ఒకరికి..
నేరేడుచర్ల : నేరేడుచర్ల మండలం మేడారం గ్రామానికి చెందిన మరొక వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు పెంచికల్‌దిన్నె ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యాధికారి హరికిషన్‌ ఆదివారం తెలిపారు. రెండురోజుల క్రితం అదేగ్రామానికి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రాగా అతనితో సన్నిహితంగా ఉన్న ఇతడికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. అతడి కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌ చేశారు.  

ఎల్బీనగర్‌లోమహిళకు కరోనా ..
గరిడేపల్లి (హుజూర్‌నగర్‌) : మండలంలోని ఎల్బీనగర్లో ఓ మహిళకు కరోనా సోకినట్లు ఆదివారం మండల వైద్యాధికారి  రమ్య తెలిపారు. ఎల్బీనగర్‌కు చెందిన 25 సంవత్సరాల మహిళకు కరోనా లక్షణాలు ఉండటంతో జూన్‌  28వ తేదీ నుంచి హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలిపారు. ఈమె తాను పనిచేసే చోట ప్రైమరీ కాంటాక్ట్‌ కావడంతో పాజిటివ్‌గా నమోదు అయినట్లు తెలిపారు. పరీక్షలు చేయించుకోవటంతో పాజిటివ్‌గా వచ్చిందని తెలిపారు ఈమెకు సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్‌ను గుర్తించినట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు