సాక్షి, సిరిసిల్ల : భారత ప్రభుత్వం విడుదల చేసిన రూ.1000 నాణేం సిరిసిల్లకు చేరింది. సిరిసిల్లకు చెందిన బుడిమె ప్రకాశ్ అనే వ్యాపారి ఈ నాణాన్ని అందుకున్నారు. ఇందుకు ప్రకాశ్ రూ.8 వేలు మింట్కు చెల్లించారు. దీంతోపాటు మరో రూ.10 నాణాన్ని ప్రకాశ్ అందుకున్నారు. రూ.1000 నాణేంలో 80శాతం వెండి, 20 శాతం కాపర్తో 44 మిల్లీమీటర్ల మందం, 200 మిల్లీమీటర్ల వ్యాసార్థంతో 35 గ్రాముల బరువుంది. రూ.10 నాణేం 7.71 గ్రాముల బరువు, 21 మిల్లీమీటర్ల వ్యాసార్థంతో ఉంది. ముంబయికి చెందిన మింట్ భారతదేశ రాజముద్ర, పూరీజగన్నాథ్ ఫొటోలతో నాణేలు ముద్రించారు. ఇప్పటికే ప్రకాశ్ రూ.75, రూ. 50, రూ.150 పది రకాల రూ.100 నాణేలు సొంతం చేసుకున్నారు. త్వరలో రూ.200 నాణేం వస్తుందని దానికి డబ్బు చెల్లిస్తున్నట్లు ప్రకాశ్ తెలిపారు. మూడు దశాబ్దాలుగా వివిధ రకాల నాణేలు, కరెన్సీలను సేకరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.