వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

9 Mar, 2017 03:06 IST|Sakshi

నార్కట్‌పల్లి (నకిరేకల్‌) : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా పలువురికి తీవ్ర గాయాలైన సంఘటన మండల కేంద్రంలోని వివేరా హోటల్‌ వద్ద బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గణేష్‌ ఆనంద్‌ ఐడీఎల్‌ కంపెనీలో పనిచేస్తున్న మహిళా కార్మికులు బుధవారం  సాయంత్రం విధులు ముగించుకుని ఆటోలో నార్కట్‌పల్లికి వస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి మిర్యాలగూడ వెళ్తున్న బోలోరో ట్రాలీ వీరి ఆటోను వెనుక నుంచి ఢీకొట్టి వెళ్లిపోయింది. ఆటో రోడ్డు పక్కన పడిపోయింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురురికి తీవ్రగాయలు కావడంతో చికిత్స నిమిత్తం 108లో స్థానిక కామినేని ఆస్పత్రికి తరలించారు.

వీరిలో ఏపీ.లింగోటం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ ఓరుగంటి సత్తయ్య(55) చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆటోలో ఉన్న నార్కట్‌పల్లి చెందిన ఎం.లక్ష్మి, అరుణశ్రీ, డి.లక్ష్మి, సంధ్య, మరో ఒకరు తీవ్రగాయలతో చికిత్స పొందుతున్నారు. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటోను ఢీకొట్టి వెళ్లిపోయిన బోలోరోను మాడ్గులపల్లి టోల్‌గేట్‌ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గోవర్ధన్‌ తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డవారిని ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకుడు బైరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.  

వెలిమినేడు వద్ద డీసీఎం డ్రైవర్‌..
చిట్యాల(నకిరేకల్‌) : ఆగి ఉన్న లారీని డీసీఎం వెనుక నుంచి ఢీకొనడంతో డీసీఎం డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన చిట్యాల మండలం వెలిమినేడు గ్రామశివారులో జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. చిట్యాల ఎస్‌ఐ ఏ.శివకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు మండలం కొలనుపాక గ్రామ పంచాయతీ పరిధిలోని బైరాంపల్లికి చెందిన గవ్వల వెంకటేష్‌(34) డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వెంకటేష్‌ లోడుతో ఉన్న డీసీఎంతో రాజమండ్రి నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తూ చిట్యాల మండలం వెలిమినేడు శివారులో హైవేపై ఆగి ఉన్న వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకటేష్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  

మోత్కూర్‌ వద్ద వృద్ధుడు..మోత్కూరు (తుంగతుర్తి) : బైక్‌ ఢీ కొనడంతో
ఓ వృద్ధుడు మృతిచెందిన సంఘటన మోత్కూరు మండల కేంద్రంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొండగడప గ్రామపంచాయతీ పరిధిలోని జటంగిబావికి చెందిన జటంగి లింగమల్లు(60) మండల కేంద్రంలో తన యజమాని బైరు సత్యనారాయణ ఇంటికి వెళ్లి పాలు ఇచ్చి రాత్రి నడుచుకుంటూ వెళ్తున్నాడు. లింగమల్లు ఓ చోట రోడ్డు క్రాస్‌ చేస్తుండగా బైక్‌పై అతివేగంగా వస్తున్న చిందం రాజు వెనుక నుంచి ఢీకొట్టాడు. బైక్‌ పక్కనే ఉన్న డ్రెయినేజీలో పడిపోయింది. లింగమల్లు తలకు తీవ్రగాయమై రక్తస్రావం కావడంతో చికిత్స కోసం హైదరాబాద్‌ తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు