‘పంచాయతీ’ పోరులో రూ.కోటి నగదు స్వాధీనం

24 Jan, 2019 03:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మూడు విడతలుగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు రూ.కోటి 78 లక్షల మేర నగదు, రూ.36 లక్షలకు పైగా విలువైన మద్యం, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో బుధవారం ఒక్కరోజే వనపర్తి జిల్లాలో రూ.20 లక్షల నగదుతో పాటు, వివిధ జిల్లాల్లో మొత్తం రూ.3.85 లక్షల విలువైన మద్యాన్ని (1500 లీటర్లకు పైగా మద్యం) పట్టుకున్నారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక ఇప్పటిదాక అధికారులు, పోలీసులు జరిపిన తనిఖీల్లో ఈ మేరకు నగదుతో పాటు వివిధ వస్తువులు దొరికినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ)కు డీజీపీ మహేందర్‌రెడ్డి నివేదికలు పంపించారు.

ఈ నివేదికల ప్రకారం ఇప్పటివరకు 289 ఫిర్యాదులు నమోదుచేసి, వాటిలో 288 ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశారు. 139 కేసుల్లో చర్యలు తీసుకున్నట్లుగా వెల్లడైంది. రాజకీయపార్టీలు, అభ్యర్థుల మధ్య సంబంధాలపై ఆరా తీయగా మొత్తం 40 వరకు బయటపడ్డాయని, వాటిలో జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 14, మెదక్‌ జిల్లాలో 4, నిర్మల్, భద్రాద్రి, నల్లగొండ, సూర్యాపేట, పెద్దపల్లి జిల్లాల్లో ఒక్కో ఉదంతం బయటపడినట్లు ఈ నివేదికను బట్టి తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు