పశువుల కాపరిపై పులి పంజా 

15 Feb, 2020 01:30 IST|Sakshi

తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు  

కోటపల్లి (చెన్నూర్‌): మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం పశువుల కాపరిపై పులి దాడి చేసింది. బమన్‌పల్లి గ్రామానికి చెందిన కుర్మా వెంకటయ్య రోజు లాగానే నక్కలపల్లి అటవీ ప్రాంతంలో పశువులను మేపడానికి వెళ్లాడు. ఒక్కసారిగా పశువులపై పులి దాడి చేయబోయే క్రమంలో ప్రతిఘటించడంతో అతనిపై పంజా విసిరింది. దీంతో వెంకటయ్య  గాయపడ్డాడు.

అతి కష్టం మీద గ్రామ సమీపంలోకి వచ్చి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యుడు ప్రథమ చికిత్స అందించాడు. మెరుగైన వైద్యం కోసం చెన్నూర్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఎఫ్‌డీవో రాజారావు, ఎఫ్‌ఆర్వో రవికుమార్, డిప్యూటీ రేంజర్‌ దయాకర్‌ బాధితుడిని పరామర్శించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించగా.. పులి పాదముద్రలను చూసారు. దాడి చేసింది పులి అని గుర్తించారు.

మరిన్ని వార్తలు