పన్ను కట్టలేదని గీతకార్మికుల అరెస్టు

6 Mar, 2018 02:09 IST|Sakshi

 ఆందోళనకు దిగిన టీకేజీకేఎస్‌

జనగామ అర్బన్‌:  గీత కార్మికులను ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్‌లో నిర్బంధించారు. సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. జనగామకు చెందిన గీత కార్మికులు తాటి పన్ను కట్ట లేదన్న కారణంతో  ఎక్సైజ్‌ సీఐ శేషగిరిరావు ఆదేశాల మేరకు ఎస్సై పవన్‌ తన సిబ్బందితో కలసి తాటి వనంలోకి వెళ్లారు. వనంలో ఉన్న బూడిద సత్యనారాయణ, పూజారి రమేశ్, బత్తిని ఉపేందర్, గంగాపురం సత్తయ్య, చిర్ర సత్తయ్యను అదుపులోకి తీసుకున్నారు.

రూ.72 వేలు పన్ను చెల్లిస్తేనే బయటకు పంపుతామం టూ స్టేషన్‌లో నిర్బంధించారు. విషయం తెలుసుకున్న తెలంగాణ కల్లు గీత కార్మిక సం ఘం(టీకేజీకేఎస్‌) రాష్ట్ర సహాయ కార్యదర్శి బూడిద గోపి నేతృత్వంలో పలువురు ఎక్సైజ్‌ కార్యాలయానికి చేరుకున్నారు. కార్మికులను అరెస్టు చేయడంపై అధికారులను నిలదీశారు. పన్ను చెల్లించ వద్దని మంత్రి టి.పద్మారావు  వెల్లడించారని, అలాంటప్పుడు ఎందుకు అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్మికుల నిర్బం«ధం విషయాన్ని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ మహిపాల్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కార్మికులను సాయంత్రం విడిచిపెట్టారు. దీనిపై జనగామ ఎక్సైజ్‌ సీఐ శేషగిరిరావు వివరణ కోరగా గీత కార్మికులను అరెస్టు చేయలేదని, తమ విధి నిర్వహణలో భాగంగా బకాయి ఉన్న డబ్బుల కోసం స్టేషన్‌కు తీసుకుని వచ్చామని తెలిపారు.

మరిన్ని వార్తలు