ఈటల జోలికొస్తే ప్రజలే బుద్ధి చెబుతారు

11 Mar, 2018 01:44 IST|Sakshi

రేవంత్‌రెడ్డికి టీఎంఆర్‌పీఎస్‌ హెచ్చరిక  

హైదరాబాద్‌: అణగారిన కులాల ప్రతినిధి, మంత్రి ఈటల రాజేందర్‌ జోలికొస్తే రేవంత్‌రెడ్డికి అణగారిన కులాల ప్రజలే బుద్ధి చెబుతారని టీఎంఆర్‌పీఎస్‌ ప్రతినిధులు హెచ్చరించారు. శనివారం విద్యానగర్‌లోని ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్‌ మాదిగ, జాతీయ ప్రధాన కార్యదర్శి మేడి పాపయ్య మాదిగ, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వంగపల్లి శ్రీనివాస్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి పనిగట్టుకొని అణగారిన వర్గాలనే టార్గెట్‌ చేస్తున్నారని విమర్శించారు.

రేవంత్‌ గతంలో కడియం శ్రీహరి, ఎమ్మెల్యే వీరేశంలను.. ప్రస్తుతం తాజాగా ఈటలను విమర్శించడం జరుగుతోందని అన్నారు. మంత్రి ఈటలను యావత్తు తెలంగాణ అణగారిన వర్గాల ప్రతినిధిగా తాము భావిస్తున్నమన్నారు. తక్షణమే రేవంత్‌ రెడ్డి మంత్రి ఈటలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో మాదిగ మహిళా సమాఖ్య జాతీయ అధ్యక్షురాలు ఆకారపు రుక్కమ్మ మాదిగ, రాష్ట్ర అధ్యక్షురాలు బాలమణి మాదిగ, నాయకులు సునీల్‌ మాదిగ, కొల్లూరి వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు