ప్రతి ఉద్యోగి 10 మొక్కలు నాటాలి: కారం రవీందర్‌ రెడ్డి

27 Aug, 2019 17:22 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి: రెవెన్యూ శాఖ విలీనంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. ఉద్యోగులు పత్రికల్లో వస్తోన్న వదంతులను నమ్మొద్దని టీఎన్జీవో సంగం రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌ రెడ్డి  కోరారు. జిల్లాలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1.20లక్షల మంది ఉద్యోగులు ఉన్నరన్నారు. ప్రతి ఉద్యోగి 10 మొక్కలు నాటాలని నిర్ణయించామని.. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి నుంచే శ్రీకారం చుట్టామని తెలిపారు. గతంలో కమల్‌నాథ్‌ కమిటీ చర్యల వలన ఉద్యోగ విభజనలో తెలంగాణ ఉద్యుగులే అధికంగా నష్టపోయారని తెలిపారు. దాదాపు 1200 మంది తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రాకు వెళ్లారని.. వారందరిని తిరిగి తెలంగాణకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తామన్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో స్నేహపూర్వక ప్రభుత్వం ఏర్పడి.. విభజన సమస్యల్లో కదలిక వచ్చిందన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని త్వరలోనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉద్యోగులు సంఖ్య తగ్గి పని భారం పెరిగిందన్నారు. ప్రభుత్వం వీలైనంత తొందరలో కొత్త జిల్లాల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచి వారికి 20 శాతం హెచ్‌ఆర్‌ కేటాయించాలని రవీందర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు