అ‘టెన్షన్’

19 Aug, 2014 03:17 IST|Sakshi

ముకరంపుర : ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్ అడిగిన ప్రశ్నలకు తెలిసిన మేరకు సమాధానాలు చెప్పాలి. ఆధారం కోసం జిరాక్స్ పత్రాలు చూపితే సరిపోతుంది. ఎలాంటి పత్రాలు కూడా ఎన్యూమరేటర్లకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన వివరాలు మాత్రమే ఎన్యూమరేటర్లు రాసుకుంటారు. చెప్పిన వివరాలు రాసుకున్న తర్వాత వాటిని చదివి వినిపిస్తారు. ఆ తర్వాతే మీరు సంతకం చేయాలి. సర్వే ముగిసిన తర్వాత ఇంటి గోడపై ఇప్పటికే అతికించిన స్టిక్కర్‌పై సర్వే పూర్తయినట్లు ఎన్యూమరేటర్లు రాసి సంతకం చేస్తారు.

 కుటుంబంలో ఒకరుంటే చాలు..
 ఎన్యూమరేటర్లు వచ్చినపుడు కుటుంబసభ్యులందరూ తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు. ఇంటి యజమాని లేదా బాధ్యత కలిగిన వ్యక్తులు సమాచారం ఇస్తే సరిపోతుంది. ఇంట్లో లేనివారికి సంబంధించిన ఏమైనా రుజువులు చూపించి వారి  వివరాలు నమోదు చేయించవచ్చు.

 వంట గది ప్రామాణికం కాదు
 ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇంట్లో ఉండే వంట గదులను ప్రామాణికంగా తీసుకోకుండా నివసిస్తున్న కుటుంబాల సంఖ్యను నమోదు చేస్తారు. ఒక ఇంట్లో ఎన్ని కుటుంబాలైతే నివసిస్తున్నాయో.. ఆ కుటుంబాలన్నింటికీ వేర్వేరుగా ఇంటి నంబర్లు వేశారు. దీంతో కుటుంబాల సంఖ్య పెరిగింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్చిన్నం కావడంతో వంట గదులను ప్రామాణికంగా తీసుకోవడం లేదు.

 వేసిన నంబర్ల ఆధారంగానే..
 సర్వే సిబ్బంది ఇళ్లపై వేసిన నంబర్ల ఆధారంగానే వివరాలు నమోదు చేస్తారు. ఓటరు లిస్టు లేదా మరే ఇతర గుర్తింపు కార్డు ఆధారంగా చెప్పిన వివరాలను నమోదు చేయరు.

 అద్దెగృహాల్లో ఉండే వారికి ‘బై’ నంబర్లు..
 అద్దె గృహాల్లో నివసిస్తున్న వారి వివరాలు సేకరించేందుకు అద్దెకు ఉంటున్న ఇళ్లకే ‘బై’ నంబర్లు వేశారు. బై నంబర్లు వేయకుంటే సంబంధిత వీఆర్‌వో, వీఆర్‌ఏలు లేదా తహశీల్దార్లను సంప్రదించవచ్చు.

 రేషన్ కార్డు రద్దు కాకూడదనుకుంటే...
 ఒకచోట రేషన్‌కార్డు.. మరోచోట స్థిర, చరాస్తులు ఉన్నట్లయితే.. రేషన్‌కార్డు ఉన్న చోటనే సర్వేలో నమోదు చేసుకుంటే మంచిది. అప్పుడే రేషన్‌కార్డు రద్దు కాదు. స్థిర, చరాస్తులు ఉన్నచోట సర్వేలో పాల్గొంటే.. అప్పుడు కచ్చితంగా రేషన్‌కార్డు రద్దయ్యే అవకాశముంది.

 సదరెం సర్టిఫికెట్ తప్పనిసరి..
 వికలాంగులు సదెరం సర్టిఫికెట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఒకవేళ సదరెం సర్టిఫికెట్ లేకున్నా వికలాంగుల వివరాలు నమోదు చేస్తారు. కానీ వికలాంగుల పెన్షన్ పొందడానికి సదరెం సర్టిఫికెట్ తప్పనిసరి చేయనున్నారు.
 
ఖాతా నంబరు చెబితే నష్టమేమీ లేదు..
 కుటుంబ యజమాని తన బ్యాంకు అకౌంటు నంబరు చెప్పడం వల్ల ఎలాంటి ముప్పు లేదు. అకౌంట్ నంబరు చెప్పడం.. చెప్పకపోవడం యజమాని ఇష్టమే. ప్రభుత్వం నుంచి పొందే లబ్దిని నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో వేయడానికి మాత్రమే అకౌంట్ నంబరు అడుగుతున్నారు (బ్యాంకు ఖాతా వంటి వ్యక్తిగత వివరాలు అడగరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా సర్వే నమూనా పత్రాల్లో మాత్రం బ్యాంకు ఖాతా వివరాలు తెలపాలని ముద్రించారు).
 
ఇతర ప్రాంతాలవారు రావాల్సిన పనిలేదు
 ఉపాధి కోసం దుబాయి, ముంబయి, మహారాష్ట్ర, తదితర ప్రాంతాలకు వెళ్లినవారు సర్వే కోసం రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ సొంతగ్రామాలకు వచ్చి సర్వేలో నమోదు చేసుకుని తిరిగి వెళ్లిపోతే అధికారులు మళ్లీ విచారణ చేపట్టి వారి పేర్లను తొలగిస్తారు.
 
ఆదాయం ఎంతో చెబితే చాలు
 కుటుంబ ఆదాయం ఎంతో చెబితే చాలు. ఆదాయ మార్గాల వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు.
 
ఎవరైనా అనాథలే..
 తల్లిదండ్రులు లేని పిల్లలు తాతలు లేదా సమీప బందువుల వద్ద పెరుగుతున్నా వారిని అనాథలుగానే పరిగణిస్తారు. వీరితోపాటు తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు, తల్లి లేదా తండ్రి వదిలేసినవారు, కొడుకులు లేదా కూతుళ్లు వదిలేసిన తల్లిదండ్రులను అనాథలుగానే పరిగణిస్తారు.
 
సర్వే నుంచి వీరికి మినహాయింపు
 ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులను సర్వే నుంచి మినహాయించారు. అందుకు తగిన ఆధారాలను (అడ్మిషన్, ఫీజుల రశీదులు వగైరా) చూపిస్తే సర్వే పత్రంలో నమోదు చేస్తారు. గర్భిణులు, వివిధ కారణాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని సర్వే నుంచి మినహాయించారు.
 
ఇంటికి తాళం వేసి ఉంటే..
 సర్వే జరిగే రోజు ఇంటికి తాళం వేసి ఉంటే.. పొరుగువారి నుంచి ఆ కుటుంబ యజమాని పేరు మాత్రమే నమోదు చేస్తారు. అలాంటి ఇళ్లకు ప్రత్యేకంగా మార్కువేస్తారు.
 
నకిలీ ఎన్యుమరేటర్లను నమ్మొద్దు..
 సర్వే కోసం నియమించిన ఎన్యూమరేటర్లకు గుర్తింపుకార్డు తప్పనిసరి చేశారు. గుర్తింపుకార్డు లేకుండా సర్వేకు వచ్చామని చెప్పేవారికి ఎలాంటి వివరాలూ చెప్పొద్దు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఆస్తుల వివరాలు అడిగితే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.
 
తప్పుడు సమాచారం చెప్పొద్దు..
 సర్వేకు వచ్చే ఎన్యూమరేటర్లకు వాస్తవాలే తెలపాలి. తప్పుడు సమాచారం ఇస్తే ప్రభుత్వం నుంచి అమలయ్యే సంక్షేమ పథకాలకు అనర్హులుగా గుర్తించే అవకాశముంది. కుటుంబ సామాజిక, ఆర్థిక స్థితిగతుల వివరాలు సమగ్రంగా చెబితేనే రేషన్‌కార్డులు, ఇళ్లు పెన్షన్లకు అర్హత పొందుతారు.
 
ఇది రహస్య సమాచారం
 సమగ్ర సర్వే ద్వారా సేకరించిన సమాచారం అంతా కూడా రహస్యంగా ఉంటుంది. మూడోవ్యక్తికి కుటుంబ వివరాలు చెప్పరు. సర్వే ఫారం జిరాక్స్‌లను బయటకు ఇవ్వడానికి వీల్లేదు (ఇంటింటి సర్వేలో పాల్గొనడం అనేది ప్రజల ఇష్టంపై (ఐచ్ఛికం) ఆధారపడి ఉంటుందని, ఎలాంటి ఒత్తిడీ చేయరాదని ఇటీవల హైకోర్టు సూచించింది).

మరిన్ని వార్తలు