అప్‌డేట్స్‌: హరన్నా.. ఇక సెలవు

30 Aug, 2018 08:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాజ్యసభ మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి గురువారం సాయంత్రం అంత్యక్రియలు ముగిసిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలను నిర్వహించారు. మెహిదీపట్నంలోని నందమూరి హరికృష్ణ స్వగృహం నుంచి మహాప్రస్థానం వరకు అంతకుముందు అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య సాగింది. అంతిమయాత్రకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇవి..

  • సాయంత్రం 4.20 గంటలు: మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. నందమూరి కళ్యాణ్‌రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
     
  • మధ్యాహ్నం 3.25 గంటలు: నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానం చేరుకుంది. మరికాసేపట్లో అధికార లాంఛనాలతో హరికృష్ణ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. దాదాపు గంటన్నరపాటు హరికృష్ణ అంతిమయాత్ర కొనసాగింది.
     
  • మధ్యాహ్నం 2.30 గంటలు: మెహిదీపట్నంలోని స్వగృహం నుంచి ప్రారంభమై హరికృష్ణ అంతిమయాత్ర కుటుంబసభ్యుల, అభిమానుల అశ్రునయనాల మధ్య కొనసాగుతోంది. 


     

  • మధ్యాహ్నం 2 గంటలు : నటుడు నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభమైంది. మెహిదీపట్నంలోని హరికృష్ణ స్వగృహం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర సరోజిని దేవి కంటి ఆస్పత్రి, మెహదీపట్నం, రేతిబౌలి, నానల్‌నగర్‌, టోలిచౌకి ఫ్లైఓవర్‌, కేఎఫ్‌సీ, అర్చెన్‌ మార్బెల్స్‌, షేక్‌పేట్‌నాలా, ఒయాసిస్‌ స్కూల్‌, విస్పర్‌ వ్యాలీ జంక్షన్‌ మీదుగా.. కుడివైపునకు తిరిగి జేఆర్సీ కన్వెన్షన్‌ మీదుగా మహాప్రస్థానానికి చేరుకోనుంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. 
     
  • మధ్యాహ్నం 12.30 గంటలు: నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి వైఎస్సార్‌సీపీ నేతలు నివాళులర్పించారు. మెహిదీపట్నంలో హరికృష్ణ నివాసానికి వెళ్లిన పార్టీ నేతలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హరికృష్ణకు శ్రద్ధాంజలి ఘటించి.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.


     

  • ఉదయం 11.30 గంటలు: నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున మెహిదీపట్నంలోని ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. మరోవైపు అభిమానులు కూడా భారీ సంఖ్యలో వస్తుండటంతో.. ఇక్కడ రద్దీని నియంత్రించేందుకు పోలీసులు పలు చర్యలు చేపట్టారు. హరికృష్ణ ఇంటికి వెళ్ళే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. బంధువులను మాత్రమే ఇంట్లోకి అనుమతిస్తున్నారు. అభిమానులు అంత్యక్రియలు జరిగే జుబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం శ్మశానవాటికకు చేరుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. 
     
  • ఉదయం 10 గంటలు: హరికృష్ణ భౌతికకాయానికి టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్‌, సినీ నటుడు కోట శ్రీనివాస రావు, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు నివాళులు అర్పించారు. అనంతరం డీఎస్‌ మాట్లాడుతూ.. హరికృష్ణ మృతి చాలా బాధాకరం, దురదృష్టకరమన్నారు. ఆయన తనను చాలా అభిమానించేవారని తెలిపారు. ఆయన మాట్లాడుతుంటే చాలా మంచిగా అనిపించేదని గుర్తు చేసుకున్నారు. మంచి మిత్రుడుగా ఉండేవారని పేర్కొన్నారు. కోట శ్రీనివాస రావు మాట్లాడుతూ..హరికృష్ణతో నా అనుబంధం ఇప్పటిది కాదని తెలిపారు. ఆయన మరణం తీరని లోటని వ్యాఖ్యానించారు. సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ..హరికృష్ణ, తన నియోజకవర్గంలో ఎన్టీఆర్‌ విగ్రహ ఆవిష్కరణకు వచ్చారని వెల్లడించారు. చంద్రబాబు బస్సు యాత్రలో, సత్తుపల్లిలో జరిగిన సమావేశాల్లో హరికృష్ణని కలిశానని గుర్తు చేసుకున్నారు. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి హరికృష్ణ అని కొనియాడారు.


     

  • ఉదయం 9 గంటలు: హరికృష్ణ నివాసానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు..  హరికృష్ణ పార్థివదేహానికి నివాళులు.. ఈ సందర్భంగా హరికృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించిన వెంకయ్యనాయుడు.
  • హరికృష్ణ పార్థివదేహానికి ఎంపీ కవిత, నాగార్జున, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, జగపతిబాబు, అశ్వనీదత్‌ నివాళులర్పించారు.
     
  • ఉదయం 8.30.. పలు చోట్ల నిదానంగా కదులుతున్న వాహనాలు
  • పలు ప్రాంతాల్లో ట్రాఫ్‌క్‌ జామ్‌ ఏర్పడింది. లకిడికపూల్‌ ఫ్లైఓవర్‌, మహవీర్‌ ఆస్పత్రి, మాసబ్‌ ట్యాంక్‌ టవర్స్‌ ప్రాంతాల్లో  ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. నార్త్‌ జోన్‌ డీసీపీ ఆఫీస్‌ నుంచి వైఎంసీఏ ఫ్లైఓవర్‌, ఎస్‌బీహెచ్‌ క్రాస్‌రోడ్‌, ప్లాజా క్రాస్‌రోడ్‌ ప్రాంతల్లో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి.
     
  • హరికృష్ణ అంతిమ యాత్ర నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.
  • హరికృష్ణ అంతిమ యాత్ర దృష్ట్యా పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మాసబ్‌ ట్యాంక్‌ నుంచి సరోజిని ఆస్పత్రి మార్గంలో వెళ్లే వాహనదారులు బజార్‌ఘట్‌, ఆసిఫ్‌నగర్‌ మీదుగా వెళ్లాలని సూచించారు. గచ్చిబౌలి నుంచి వచ్చేవారు ఫిల్మ్‌నగర్‌ మీదుగా వెళ్లాలని ఆంక్షలు విధించారు.
  • మెహదీపట్నం ఎన్‌ఎండీసీలోని హరికృష్ణ ఇంటి నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతోంది. సరోజిని దేవి కంటి ఆస్పత్రి, మెహదీపట్నం, రేతిబౌలి, నానల్‌నగర్‌, టోలిచౌకి ఫ్లైఓవర్‌, కేఎఫ్‌సీ, అర్చెన్‌ మార్బెల్స్‌, షేక్‌పేట్‌నాలా, ఒయాసిస్‌ స్కూల్‌, విస్పర్‌ వ్యాలీ జంక్షన్‌ మీదుగా.. కుడివైపునకు తిరిగి జేఆర్సీ కన్వెన్షన్‌ మీదుగా మహాప్రస్థానానికి చేరుకోనున్న అంతిమయాత్ర. సాయంత్రం హరికృష్ణ అంత్యక్రియలు.

    (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు