నేడు నగరానికి 14వ ఆర్థిక సంఘం

18 Sep, 2014 00:38 IST|Sakshi

రాజ్‌భవన్‌లో సంఘం సభ్యులకు గవర్నర్ విందు
రేపు సీఎం, మంత్రులు, అధికారులతో సభ్యుల సమావేశం

 
హైదరాబాద్: వైవీ రెడ్డి నేతృత్వంలోని 14వ ఆర్థిక సంఘం గురువారం హైదరాబాద్‌కు వస్తోంది. తెలంగాణ ప్రభుత్వంతో ఆర్థిక సంఘం ప్రతినిధులు శుక్రవారం సమావేశమై వారితో చర్చించిన తరువాత నివేదిక తీసుకోనున్నారు. 14వ ఆర్థిక సంఘం సభ్యులకు గురువారం గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో విందు ఇస్తున్నారు. 19వ తేదీ ఉదయం 10 గంటలకు గ్రీన్‌ల్యాండ్స్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఆర్థిక సంఘం ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అధికారులు మధ్యాహ్నం వరకు సమావేశమై ప్రభుత్వ కోర్కెల చిట్టా వివరించనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం నుంచి రాజకీయ పార్టీల నేతలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు కమిషన్‌ను కలువనున్నారు.

శుక్రవారం రాత్రికి సీఎం కేసీఆర్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో విందు ఇస్తారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినందున.. చేపట్టనున్న కొత్త పథకాలకు విరివిగా నిధులిచ్చేలా కేంద్రానికి సిఫారసు చేయాలని ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. శనివారంనాడు కమిషన్ సభ్యులు తిరిగి ఢిల్లీ వెళ్లిపోనున్నారు.

 సీఎం సమీక్ష.. 14వ ఆర్థిక సంఘాన్ని కోరే అంశాలపై సీఎం కేసీఆర్ బుధవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. వాటర్‌గ్రిడ్, పోలీసు వ్యవస్థ బలోపేతం, రహదారుల నిర్మాణంపై స్పష్టత ఇవ్వాలన్నారు. సమావేశంలో ఆర్థికమంత్రి ఈటెల, సలహాదారులు పాపారావు, జీఆర్‌రెడ్డి, సీఎస్ రాజీవ్‌శర్మ, అధికారులు పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు