రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

25 Aug, 2018 09:12 IST|Sakshi

హైదరాబాద్‌ రన్‌ నేపథ్యంలో..

తెల్లవారుజాము 4.30 నుంచి 12 గంటల వరకు     

పోలీస్‌ కమిషనర్లు అంజనీకుమార్, సజ్జనార్‌ ప్రకటన

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ రన్నర్స్‌ మారథాన్‌ రన్‌ ఆదివారం హైదరాబాద్, సైబరాబాద్‌ పరిధిల్లోని నెక్లెస్‌రోడ్‌–గచ్చిబౌలి స్టేడియం మధ్య 42 కిలో మీటర్ల మేర జరుగనుంది. ఇందులో దాదాపు 20 వేల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఈ రన్‌ నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులకు తావు లేకుండా రెండు కమిషరేట్ల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ పోలీసు కమిషనర్లు అంజనీ కుమార్, వీసీ సజ్జనార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

నగరంలో తెల్లవారుజాము 4.30 నుంచి ఉదయం 9 గంటల వరకు, సైబరాబాద్‌లో ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 వరకు అమలులో ఉండనున్నాయి. వీవీ  విగ్రహం, తెలుగుతల్లి, ఇక్బాల్‌ మీనార్, లిబర్టీ, కర్బాల మైదాన్, కవాడిగూడ చౌరస్తా, డీబీఆర్‌ మిల్స్, నల్లగుట్ట జంక్షన్, ఎన్‌ఎఫ్‌సీఎల్‌ ఐలాండ్, క్యాన్సర్‌ హాస్పిటల్, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్, రోడ్‌ నెం.1/45, రోడ్‌ నెం.36/10 జంక్షన్లు, కావూరి హిల్స్, రోడ్‌ నెం.45, సైబర్‌ టవర్స్‌ జంక్షన్, మెటల్‌ చార్మినార్, బయోడైవర్శిటీ పార్క్, గచ్చిబౌలి జంక్షన్, లింగంపల్లి జీహెచ్‌ఎంసీ ఆఫీస్, విప్రో జంక్షన్, గోపన్‌పల్లి ఎక్స్‌రోడ్స్, గచ్చిబౌలి ట్రాఫిక్‌ పీఎస్‌ కేంద్రంగా ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయి.  

ఎస్‌ఐ అభ్యర్థులు ముందుగా చేరుకోవాలి
ఆదివారం సైబరాబాద్‌లోని 55 సెంటర్లలో ఎస్సై అభ్యర్థుల ప్రాథమిక పరీక్ష జరుగనుంది. దీనికి దాదాపు 1.88 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతాయని అంచనా. ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షలకు హాజరయ్యే వారు ఈ ట్రాఫిక్‌ ఆంక్షల్ని దృష్టిలో పెట్టుకోవాలని కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ కోరారు. నిర్ణీత సమయానికి ముందే బయలుదేరాలని పేర్కొన్నారు. ఎలాంటి సహాయం అవసరమైనా సైబరాబాద్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌ 8500411111, 040–23002424, మాదాపూర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ 9490617257, గచ్చిబౌలి ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ 9490617479 నెంబర్లకు ఫోన్‌ చేయవచ్చు.

మరిన్ని వార్తలు