దిశ కేసు.. వెలుగులోకి కీలక వీడియో

9 Dec, 2019 16:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యావత్‌ దేశాన్ని కదిలించిన దిశ హత్యాచారం కేసులో మరో కీలక ఆధారం వెలుగులోకి వచ్చింది. గత నెల 27వ తేదీన రాత్రి సమయంలో నలుగురు నిందితులు వెటర్నరీ డాక్టర్‌ దిశపై అత్యాచారం చేసి.. పాశవికంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం నిందితులు చటాన్‌పల్లిలోని సంఘటన స్థలంలోనే పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. దిశ హత్యాచారం, నిందితుల ఎన్‌కౌంటర్‌ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించిన కీలక వీడియోను తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఆధారంగానే పోలీసులు దిశ కేసును ఛేదించి నిందితులను గుర్తించారు. నవంబర్‌ 27వ తేదీన రాత్రి 10.28 గంటల సమయంలో తొండూపల్లి టోల్‌గేట్ వద్ద నుంచి వెళ్తున్న ఈ లారీలో దిశ మృతదేహాన్ని నిందితులు తరలించారని పోలీసులు గుర్తించారు. టోల్‌గేట్‌ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో లారీ వెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి.



అసలు ఆ రోజు ఏం జరిగింది..
తొండూపల్లి టోల్ ప్లాజా వెనకాల ఉన్న ఖాళీ ప్రదేశంలో నిందితులు దిశపై సామూహిక అత్యాచారం జరిపి.. ఆపై హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. నవంబర్‌ 27వ తేదీన రాత్రి 10 గంటల తర్వాత దిశను నిందితులు హతమార్చారని, అనంతరం శరీరానికి దుప్పట్లు చుట్టి.. ఆపై కిరోసిన్‌ పోసి తగులబెట్టారని, ఈ ఘటనలో ఆమె మృతదేహం 70 శాతం కాలినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం.. ఘటనాస్థలం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల వరకు ఆమె మృతదేహాన్ని లారీలో తీసుకువెళ్లినట్లు వెల్లడించారు. ఇలా లారీలో మృతదేహాన్ని తీసుకువెళుతుండగా.. ఆ దృశ్యం తొండూపల్లి టోల్‌గేట్‌ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. నిందితుల లారీ వీడియో దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.
చదవండి: ఇప్పటికైనా మృతదేహాలు అప్పగించండి!

>
మరిన్ని వార్తలు