యాదాద్రి ఫస్ట్, వికారాబాద్‌ లాస్ట్‌ 

16 May, 2019 01:19 IST|Sakshi

మూడు విడతల ‘పరిషత్‌ పోరు’ గణాంకాలు విడుదల

యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 87.02% పోలింగ్‌

వికారాబాద్‌ జిల్లాలో అత్యల్పంగా 70.40% ఓటింగ్‌ నమోదు

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 6, 10, 14 తేదీల్లో జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో మొత్తం 77.46 శాతం ఓటింగ్‌ నమోదవగా అందులో మహిళలు 77.68 శాతం, పురుషులు 77.24 శాతం, ఇతరులు 7.64 శాతం ఓటేశారు. జిల్లాలవారీగా చూస్తే 87.02 శాతం పోలింగ్‌తో యాదాద్రి భువనగిరి జిల్లా తొలిస్థానం లో నిలవగా వికారాబాద్‌ జిల్లా అత్యల్పంగా 70.40 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. 534 జెడ్పీటీసీ స్థానాలకు(ఏకగ్రీవమైన 4 స్థానాలు మినహా) 2,426 మంది, 5,659 ఎంపీటీసీ స్థానాలకు (158 ఏకగ్రీవా లు మినహా) 18,930 మంది పోటీపడ్డారు. జెడ్పీటీసీ స్థానాలకు సగటున ఐదుగురు, ఎంపీటీసీ స్థానాలకు సగటున ముగ్గురు ఎన్నికల బరిలో నిలిచారు. పార్టీలవారీగా పోటీ చేసిన అభ్యర్థులు, ఎన్నికల నిర్వహణ కు సంబంధించిన గణాంకాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి బుధవారం విడుదల చేశారు.

ఈ ఎన్నికల్లో మొత్తం 32,045 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటిలో 2,488 పోలింగ్‌ బూత్‌ లలో ఎస్‌ఈసీ వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహించింది. మొత్తం 2,879 రిటర్నింగ్‌ అధికారులను నియమించింది. ఎన్నికల విధుల కోసం 1.86 లక్షల మంది సిబ్బంది ని ఎంపిక చేసింది. 54,604 మంది భద్రతా సిబ్బంది ని సేవల వినియోగించుకుంది. సాధారణ పరిశీలకులుగా 15 మందిని, వ్యయ పరిశీలకులుగా 37 మందిని, సహాయ వ్యయ పరిశీలకులుగా 528 మందిని, మైక్రో అబ్జర్వర్లుగా 2,832 మందిని నియమించింది. మొత్తం 65 వేల బ్యాలెట్‌ బాక్సులు, దాదాపు 3.5 కోట్ల బ్యాలెట్‌ పత్రాలు ముద్రించారు. ఓటేసినందుకు గుర్తుగా వేసే నల్లటి సిరా రంగు కోసం 42 వేల ఇండెలిబుల్‌ ఇంక్‌ ఫాయల్స్‌ ఉపయోగించారు. 1.6 లక్షల పేపర్‌ సీళ్లను ఉపయోగించారు.

మరిన్ని వార్తలు