‘తోటపల్లి’ని రద్దు చేయాలని రాస్తారోకో

14 Aug, 2015 01:48 IST|Sakshi

తిమ్మాపూర్ : తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేయాలని కోరుతూ నిర్వాసిత గ్రామస్తులు మండలంలోని కొత్తపల్లిలో గురువారం రాస్తారోకో చేశారు. ఒగులాపూర్, ఇందుర్తి, వరుకోలు, ఎర్రగుంటపల్లె, రాంచంద్రాపూర్, గొట్లమిట్లకు చెందిన నిర్వాసితులు అరగంటపాటు ఆందోళన నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, టీపీసీసీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేసి సేకరించిన భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సేకరించిన భూములను పరిశ్రమలకు ఇస్తే ఒప్పుకునేది లేదన్నారు. కాలువల ద్వారా నీరు ఇవ్వడం హర్షనీయమన్నారు. రిజర్వాయర్ నిర్మించాలని పట్టుబడుతున్న కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, బీజేపీల వైఖరి అనాలోచితమని ఆరోపించారు. ఎల్‌ఎండీ ఎస్సై సతీష్‌కుమార్ సిబ్బందితో వచ్చి రాస్తారోకోను విరమింపజేశారు. ఇందులో హుస్నాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బద్దం నర్సింహారెడ్డి, ఎంపీటీసీలు ఆకుల మొగిలి, అందె సుజాత, టీఆర్‌ఎస్ నాయకులు, నిర్వాసితులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు