‘దుబ్బాకలో రామలింగా రెడ్డి ఓటమి ఖాయం’

3 Oct, 2018 17:19 IST|Sakshi
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావుపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్‌ కుటుంబాన్ని తరిమి కొట్టాలని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గోరి కట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం టీఆర్‌ఎస్‌ నేత నాగేశ్వర్‌ రెడ్డి.. ఉత్తమ్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్‌ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని ఎద్దేవా చేశారు. దుబ్బాకలో రామలింగా రెడ్డి ఓటమి ఖాయమనిపిస్తోందని అన్నారు. తెలంగాణ ప్రజలు కన్న కళ చెదిరిపోయిందని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కేసీఆర్‌ను బొంద పెట్టాలని విమర్శించారు.

కొద్ది రోజుల క్రితం తాను ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లగా అక్కడి విద్యార్ధుల్లో కేసీఆర్‌ను తిట్టని వారు లేరని తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలో ఏనాడూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఆపలేదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డనాటికి ఉన్న ఉద్యోగాల ఖాళీలను ఈ రోజు వరకు ప్రభుత్వం భర్తీ చేయలేదని తెలిపారు. తాము ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి సంవత్సరంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.  దుబ్బాకలో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుస్తాడని ఆయన అభిప్రాయపడ్డారు. 

మరిన్ని వార్తలు