‘పార్టీలో మాకు అవమానం జరుగుతోంది’

3 Mar, 2017 19:25 IST|Sakshi
‘పార్టీలో మాకు అవమానం జరుగుతోంది’

హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీలో తమకు అవమానం జరుగుతోందని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీలో క్రమశిక్షణ అంశంపై ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమ సమయంతో తన సోదరుడు వెంకటరెడ్డి మంత్రి పదవిని త్యాగం చేసి పార్టీ ఇమేజ్ ను పెంచారని గుర్తు చేశారు.

టీఆర్ఎస్‌ ప్రభుత్వ ఒత్తిళ్లను తట్టుకుని కేడర్ ను కాపాడుకుంటున్నామన్నారు. సవాల్ గా తీసుకుని ఎమ్మెల్సీగా ఎన్నికయ్యానని గుర్తు చేశారు. తమకు పట్టున్న అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు కష్టమంటూ మీడియాలో పీసీసీ చీఫ్ కథనాలు రాయించి అవమానించారని వాపోయారు. పార్టీలో పొమ్మనలేక పొగ పెట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కొందరు నేతలు తనను కూడా విమర్శించారని దిగ్విజయ్ సింగ్ గుర్తు చేశారు. క్రమశిక్షణ విషయంలో తాను ఉదారంగా ఉంటున్నానని చెప్పారు. కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య విభేదాల అంశాన్ని ముగించాలని సీనియర్ నేత సర్వే సత్యనారాయణ సూచించారు.

మరిన్ని వార్తలు