రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి

5 May, 2020 18:34 IST|Sakshi

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ ‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం తీరుతో వలస కార్మికుల జీవితాలు నాశనమయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ ‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం కాంగ్రెస్ నేతలు చేపట్టిన రైతు సంక్షేమ దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించాలని కోరారు. మద్యం షాపులను తెరవద్దని.. దీని వలన మరిన్ని సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. 40 రోజులు లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని.. మద్యం అమ్మకాలు జరిపితే సమస్యలు మరింత జఠిలమవుతాయన్నారు.

లాక్‌డౌన్‌ సమయంలో కేసీఆర్‌ ప్రభుత్వం ఎందుకు వలస కార్మికులను ఆదుకోవడం లేదని నిలదీశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని సార్లు చెప్పిన ముఖ్యమంత్రి వినడం లేదన్నారు. 44 రోజుల లాక్‌డౌన్‌లో రాష్ట్రంలో వలస కార్మికులు ఎంత మంది ఉన్నారో సరైన లెక్కలు ప్రభుత్వం లేవని దుయ్యబట్టారు. వలస కార్మికులు కోసం హైదరాబాద్‌లో 400 అన్నపూర్ణ క్యాంటీన్లు పెట్టామన్నారని.. కానీ అవీ ఎక్కడెక్కడ ఉన్నాయో వివరాలు లేవన్నారు. తెలంగాణ అభివృద్ధికి వలస కార్మికులు దోహదపడ్డారని..వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. వారు సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు రైల్వే శాఖ టిక్కెట్‌ ధర 50 రూపాయలు ఛార్జ్‌ చేస్తుందని.. వలస కార్మికుల టిక్కెట్‌ డబ్బులను కాంగ్రెస్‌ పార్టీ భరిస్తుందని తెలిపారు.

మరిన్ని వార్తలు