‘తగిన ధర ఇచ్చినప్పుడే పంటలు వేయమని చెప్పాలి’

21 May, 2020 15:33 IST|Sakshi

సాక్షి, జగిత్యాల: తెలంగాణలో తక్కువ టెస్ట్‌లు చేస్తున్నందువల్లే తక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయని టీపీసీసీ అధ్యక్షులు ఉ‍త్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. గురువారం ఆయన జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ... ‘పక్క రాష్ట్రాల్లో 2 లక్షల టెస్టులు చేస్తే తెలంగాణ లో కేవలం 22 వేల టెస్టులు మాత్రమే చేశారు.  ప్రభుత్వం పారదర్శకంగా పని చేయడం లేదు.  ఐ సీ ఎం ఆర్ ప్రైవేట్‌ ఆసుపత్రులలో టెస్టులు చేయాలని చెబితే హైకోర్టు చెప్పేవరకు రాష్ట్రం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి తప్పుడు ధోరణి వల్లనే తక్కువ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో రోజుకు 5 వేలు టెస్టులు చేయాల్సి ఉంటే కేవలం 200 మాత్రమే చేస్తున్నారు. రాష్ట్రంలో వలస కూలీలు ఎంత మంది ఉన్నారో కూడా ప్రభుత్వం చెప్పలేకపోతుంది. ఇక మీరు వాళ్లకు ఎం తిండి పెడతారు. కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ వలస కులీలకు రవాణా ఖర్చులు చెల్లించినందుకు అభినందిస్తున్నాను. కేంద్రం నుండి వివిధ వర్గాల నుండి వచ్చిన విరాళాల వివరాలు చెప్పమంటే చెప్పట్లేదు. కరోనాకు ఎంత ఖర్చు చేశారో కూడా చెప్పట్లేదు. 6 ఏళ్లుగా అడ్డగోలు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారు. రాష్ట్రం కరోనా వల్ల అప్పులపాలు కాలేదు. రాష్ట్ర ప్రజలను, బండ్లను కుదువపెట్టి 4 వేల కోట్లు అప్పు తెచ్చారు. మహ్మద్ బిన్ తుగ్లక్ కంటే  కేసీఆర్ ఎక్కవ చెబుతున్నారు’ అని ఉత్తమ్‌ కుమార్‌ ధ్వజమెత్తారు. (కరోనా : తెలంగాణపై కేంద్రం ఆగ్రహం)

ఇంకా ఆయన మాట్లాడుతూ... కందులు కొని 3 నెలలు గడిచినా ఇంకా డబ్బులు ఇవ్వలేదు కానీ మళ్ళీ కంది పంట వేయమంటరా? అని ప్రశ్నించారు. రైతు బంధు పథకంలో మోసం జరిగిందని ఆరోపించారు. హుజూర్‌నగర్‌లో ఎన్నికలు వున్నాయని రైతుబందు ఇచ్చారన్నారు. మొట్టమొదటిసారి క్రాప్ ఇన్సూరెన్స్ లేదని, రాష్ట్రంలో రైతులను దేవుడికి వదిలేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఏందాకైనా పోరాడుతుందని చెప్పారు. పత్తి విత్తనాల కంపెనీలతో ప్రభుత్వానికి లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. పత్తి 7 వేలకు కొంటేనే వేయమని చెప్పాలని, నూనె గింజలకు, పప్పు ధాన్యాలకు తగిన ధర ఇచ్చినప్పుడే పంటలు వేయమని చెప్పాలి అని ఉత్తమ్‌కుమార్‌ అన్నారు. (కేసీఆర్కు ఫ్యాషన్గా మారింది: వివేక్)

మరిన్ని వార్తలు