నిర్లక్ష్యం ఖరీదు నిండుప్రాణం

6 Jul, 2019 09:36 IST|Sakshi
ప్రమాదంలో ట్రాక్టర్‌ కింద ఇరుక్కుపోయి ధ్వంసమైన ద్విచక్రవానం

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి 

తాగిన మైకంలో  ట్రాక్టర్‌ నడిపిన డ్రైవర్‌

సాక్షి, కాజీపేట: ట్రాక్టర్‌ డ్రైవర్‌ మద్యం తాగిన మైకంలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడంతో ఓ నిండు ప్రాణం బలయింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట మండలం సోమిడికి చెందిన దువ్వ విజయ్‌కుమార్‌ (32) ద్విచక్రవాహనంపై బాపూజీనగర్‌ వైపు వస్తున్నాడు. అదే సమయంలో గృహ నిర్మాణ సామగ్రితో వెనకే వస్తున్న ట్రాక్టర్‌ బాపూజీ నగర్‌ చౌరస్తాలో అతివేగంగా వచ్చి ద్విచక్రవానాన్ని ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్‌ డ్రైవర్‌ తికమకపడి వాహనాన్ని మరింతగా ముందుకు నడిపించడంతో ట్రాక్టర్‌ ద్విచక్రవాహనంపైకి  పూర్తిగా ఎక్కింది. దీంతో ద్విచక్రవాహన చోదకుడు విజయ్‌కుమార్‌ తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటనలో మరో ద్విచక్రవాహనంపై వెళ్తున్న మరో వ్యక్తి యాదగిరికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో విజయ్‌కుమార్‌ను హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైనా వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ విజయ్‌కుమార్‌ మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కాజీపేట సీఐ అజయ్‌ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విజయ్‌కుమార్‌కు భార్యతోపాటు రెండున్నర ఏళ్ల వయస్సున్న పాప ఉంది. 

మరిన్ని వార్తలు