భాయ్‌... జర దేఖ్‌కె చలో..

26 Dec, 2018 09:20 IST|Sakshi

టెక్నాలజీతో ట్రాఫిక్‌ ఉల్లంఘనులపై కొరడా

జంక్షన్ల వద్ద జాగ్రత్తపడుతున్న వాహనచోదకులు  

గత ఏడాది 12,034 మందికి, ఈ ఏడాది 11,423 మందికి చలాన్‌లు

పెరిగిన ఈ–చలాన్‌లు, ఓవర్‌ స్పీడ్‌ కేసులు

కఠిన చర్యలు తీసుకుంటాం: రాచకొండ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్‌ జంక్షన్ల వద్ద రెడ్‌లైట్‌ ఉండగానే రయ్యిమని దూసుకెళ్లే వాహనచోదకులు...ఇప్పుడు అలా వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు లేరు కదా అనుకునే వారిని ‘సీసీటీవీ’ కెమెరాలు హడలెత్తిస్తున్నాయి. ఆటోమేటిక్‌ రెడ్‌లైట్‌ కెమెరా, ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు ఆపరేట్‌ చేసే స్పీడ్‌ లేజర్‌ గన్‌లు, డిజిటల్‌ కెమెరా, ట్యాబ్‌లు ట్రాఫిక్‌ ఉల్లంఘనుల పట్ల తమ పని తాము చేసుకుపోతున్నాయి. ఫలితంగా నేరుగా ఇంటికే ఈ చలాన్లు అందుతున్నాయి. 15 రోజుల్లో ఫైన్‌ కట్టకపోతే లీగల్‌ నోటీసులు, అయినా స్పందించకపోతే చార్జిషీట్‌ దాఖలవుతున్నాయి. కొన్ని సార్లు ఏకంగా జైలుకు వెళ్లాల్సి వస్తోంది. ఫలితంగా జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించేవారి సంఖ్య తగ్గుముఖం పడుతోంది. సిగ్నల్‌ జంపింగ్‌ ఉల్లంఘనుల సంఖ్య గతేడాది 12,034 కాగా, ఈ ఏడాది 11,423కు తగ్గిందక?్షవదుకు జంక్షన్ల వద్ద సీసీటీవీ కెమెరాలు, ట్రాఫిక్‌ కానిస్టేబుళ్ల కెమెరాల ప్రభావమే కారణంగా గుర్తించారు.  

‘స్పీడ్‌’ పట్టుకుంటున్నా తగ్గని వేగం...
ఔటర్‌ రింగ్‌ రోడ్డులో వాహన వేగం పరిమితిపై సూచన బోర్డులు కనిపిస్తాయి. ఉదహరణకు 40 కి లోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన ప్రాంతంలో 60 కిలోమీటర్ల వేగంతో దూసుకెళితే ఈ స్పీడ్‌ లేజర్‌ గన్‌లు ఇట్టే పసిగడతాయి. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్‌ 20 వరకు  1,19,933 మందికి ఈ చలా న్లు జారీ అయ్యాయి. గతేడాది పరిమితికి మించి వేగంతో వెళ్లిన వారు రాచకొండ పరిధిలోని ఓఆర్‌ఆర్‌లో 45,212 మంది ఉండగా ఈ ఏడాది వారి సంఖ్య ఏకంగా 1,19,933కు పెరగడం గమ నార్హం. అతివేగం కారణంగా ఓఆర్‌ఆర్‌లో ఈ ఏ డా ది 34 రోడ్డు ప్రమాదాలు జరగగా 20 మంది దు ర్మరణం పాలయ్యారు. 34 మంది గాయపడ్డా రు. అయినా వాహనదారుల్లో మార్పు రావడం లేదు.

జంపింగ్‌ ఈ ప్రాంతాల్లోనే...
ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు, ఎల్‌బీనగర్‌ జంక్షన్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో సిగ్నల్‌ జంపింగ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు నుంచి తార్నాక వచ్చే మార్గంలో రాంగ్‌ సైడ్‌ డ్రై వింగ్‌ చేస్తూ సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. జంక్షన్‌లతో పాటు రోడ్డుపై నో పార్కింగ్‌ జోన్‌లో నిలిపిన వాహనాలను కానిస్టేబుళ్లు కెమెరాలో బంధించి...ఆ ఫొటోలను ఆయా పోలీసు స్టేషన్‌ల నుంచి అప్‌లోడ్‌ చేసి ఈ చలాన్‌కు పంపుతున్నారు. ఈ ఏడాది  7,93,441 ఈ–చలాన్‌లు జారీ చేయగా, వీటిలో ఎక్కువగా రాంగ్‌సైడ్‌ డ్రై వింగ్, నో పార్కింగ్‌ జోన్‌లో ఉన్న వాహన కేసులే ఉన్నాయి. ఒకప్పుడు 80 శాతం వరకు ట్రాఫిక్‌ పోలీసులు పనిచేస్తే, 20 శాతం టెక్నాలజీని ఉపయోగించుకునేవారు. ఇప్పుడు 80 శాతం టెక్నాలజీతోనే పనులు చేస్తున్నామని ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొన్నారు. అయితే రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే వాహనదారుల్లోనే మార్పురావాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు