బక్రీద్‌ నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

21 Aug, 2018 09:32 IST|Sakshi

రేపు ఉదయం 8గంటల నుంచి 11:30గంటల వరకు అమలు

సాక్షి, సిటీబ్యూరో: బక్రీద్‌ పండగ నేపథ్యంలో బుధవారం వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మీరాలం ట్యాంక్‌ ఈద్గాతో పాటు సికింద్రాబాద్‌లోని ఈద్గా వద్ద ఉదయం 8గంటల నుంచి 11:30గంటల వరకు వన్‌ వే అమలులో ఉంటుందని కమిషనర్‌ పేర్కొన్నారు.  

మీరాలం వద్ద...
ఈద్గా వైపు వెళ్లే వాహనాలను పురానాపూల్, బహదూర్‌పురా పోలీసుస్టేషన్‌ మీదుగా పంపిస్తారు. ఈద్గా వైపు నుంచి బహదూర్‌పురా పోలీసుస్టేషన్‌ వైపు వాహనాలను అనుమతించరు.
శివరామ్‌పల్లి, నేషనల్‌ పోలీస్‌ అకాడమీ మీదుగా బహుదూర్‌పురా వచ్చే ట్రాఫిక్‌ను దానమ్మ గుడిసెల వద్ద ఉన్న ‘టీ’ జంక్షన్‌ నుంచి ఇంజిన్‌బౌలి మీదుగా పంపిస్తారు.  
ఈద్గా క్రాస్‌ రోడ్స్‌ నుంచి సైకిళ్లు, రిక్షాలను ఈద్గా వైపు అనుమతించరు. నిర్దేశించిన ప్రాంతాల్లో వీటిని పార్క్‌ చేసుకోవాలి.
కార్లు, ఆర్టీసీ బస్సులు, టూరిస్ట్‌ బస్సులు, లారీలు ఇతర వాహనాలను ఈద్గా వద్దకు అనుమతించరు. ఇవి మీరాలం ఫిల్టర్‌ బెడ్‌ ‘టీ’ జంక్షన్‌ నుంచి ముందుకు వెళ్లకుండా కేటాయించిన ప్రాంతాల్లో పార్క్‌ చేసుకోవాలి.
ప్రార్థనల అనంతరం ఈద్గాకు వచ్చిన వారిలో వేగంగా వెళ్లే వాహనాలను తాడ్‌బన్‌ రోడ్, బోయిస్‌ టౌన్‌ స్కూల్, న్యూ రోడ్‌ షంషీర్‌గంజ్, ఆలియాబాద్, చార్మినార్‌ మీదుగా పంపుతారు.  
సికింద్రాబాద్‌ ఈద్గా వద్ద...
బ్రూక్‌బాండ్‌ సెంటర్, సీటీఓ చౌరస్తా వైపు నుంచి వచ్చే వాహనాలను ఈద్గా ఎక్స్‌రోడ్‌ నుంచి తాడ్‌బండ్‌ వైపు పంపిస్తారు.

మరిన్ని వార్తలు