ఉప్పల్‌లో ఘోర రోడ్డుప్రమాదం

31 Dec, 2019 08:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్‌ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో స్కూల్ కి వెళ్తున్న ఆటోను వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందాడు. మరో ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో ఘటనాస్థలంలో బీభత్సకరమైన దృశ్యాలు చోటుచేసుకున్నాయి. చిన్నారుల ఆక్రందనలు, హాహాకారాలు అక్కడివారిని కలిచివేశాయి. స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఒక విద్యార్థి మృతిచెందడం, పలువురు తీవ్రంగా గాయపడటంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

లారీ అత్యంత వేగంగా దూసుకురావడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఏడో తరగతి చదువుతున్న అవంత్‌కుమార్‌ మృతి చెందాడు. హబ్సిగూడ భాష్యం స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులు ఆటోలో వెళుతుండగా ప్రమాదం బారిన పడ్డారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థి మృతదేహాన్ని గాందీ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సిగ్నల్‌ ఎవరు జంప్‌ చేశారు
ఉదయం 7.50 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని, ఈ ఘటనలో సిగ్నల్‌ ఎవరు జంప్‌ చేశారనే దానిపై దర్యాప్తు జరుపుతున్నామని ఏసీపీ నర్సింహారెడ్డి తెలిపారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా ఎవరూ తప్పు చేశారనే దానిని పరిశీలిస్తున్నామని తెలిపారు.

రోడ్డుప్రమాదంలో తమ కొడుకు మృతితో అవంత్‌ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. తన కొడుకు చాలా తెలివైనవాడని, ఉన్నత చదువులు చదవాలని అనుకున్నాడని తండ్రి సంతోష్‌ కన్నీరుమున్నీరవుతూ మీడియాకు తెలిపారు. ఈ దారుణమైన రోడ్డుప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు