ఎన్పీడీసీఎల్ సీఎండీ బదిలీకి డీల్!

20 Jun, 2014 04:25 IST|Sakshi

 హన్మకొండ  : ఎన్పీడీసీఎల్ సీఎండీ బదిలీపై డీల్ మొదలైంది. సీఎండీ కార్తికేయ మిశ్రాను బదిలీ చేయడం... ఓ సీజీఎంను ఇక్కడికి సీఎండీగా తీసుకొచ్చేందుకు కొందరు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రస్తుత సీఎండీని బదిలీ చేసేందుకు గత ఏడాది కూడా సంస్థలోని పలు ఇంజినీరింగ్ యూనియన్లు భారీ ఎత్తున పైరవీలు చేశాయి. అప్పుడే రూ. 2 కోట్లకు బేరం పెట్టారు.

తాజాగా

.... కాంట్రాక్టర్లు రంగంలోకి దిగారు. సీఎండీ, డెరైక్టర్ పోస్టు కోసం ఆశతో ఉన్న అధికారుల తరఫున ఇద్దరు మంత్రుల వద్ద ఇప్పటికే రాయబారం నడుపుతున్నారు. దీనిపై ఇప్పటికే కాంట్రాక్టర్లు ఇద్దరు మంత్రులను కలిశారు. వారి వెంట సీఎండీ కుర్చీ కోసం ఆశపడుతున్న ఓ అధికారిని తీసుకెళ్లినట్లు సమాచారం. నిజామాబాద్‌లో మంత్రి సన్నిహితుడిగా ఉన్న ఓ ఏడీఈ... పౌల్ట్రీ వ్యాపారం నిర్వహించినప్పుడు మరో మంత్రితో సంబంధాలున్న ఓ ఎన్పీడీసీఎల్ కాంట్రాక్టర్‌తోపాటు ురో సీనియర్ కాంట్రాక్టర్ ఇటీవల రాయబారం నడిపినట్లు తెలిసింది.

అందుకే.. టార్గెట్
ఎన్పీడీసీఎల్‌లో ఇటీవల సబ్‌స్టేషన్ల నిర్మాణానికి టెండర్లు పిలిచిన సందర్భంలో ధరలు పెంచాలని కాంట్రాక్టర్లు పట్టుబట్టిన విషయం తెలిసిందే. మిశ్రా ఇందుకు ఒప్పుకోకపోవడంతో టెండర్లు ఫైనల్ కాలేదు. అంతేకాకుండా పనుల పరిశీలన తర్వాతే బిల్లుల చెల్లింపులు చేయూలని, పనులు పూర్తికాకుంటే చెల్లించొద్దని సీఎండీ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో  పలువురు ఐఏఎస్‌లు, రాజకీయ నేతలతో కాంట్రాక్టర్లు ఆయనపై ఒత్తిడి సైతం తీసుకొచ్చారు.అయినప్పటికీ సీఎండీ ఫైళ్లను పెండింగ్‌లో పెడుతుండడంతో ఆయనను కాంట్రాక్టర్లు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన్ను బదిలీ చేయించి... తమకు అనుకూలంగా ఉండే వారిని సీఎండీగా రప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రూ. 3 కోట్ల నుంచి రూ.4 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

కుర్చీ కోసం పోటీ
సీఎండీ కుర్చీ కోసం పలువురు పోటీ పడుతున్నారు. ఎన్పీడీసీఎల్‌లో డెరైక్టర్‌గా పనిచేసి గత ఏడాది కేబుల్ కొనుగోలులో ఆరోపణలు ఎదుర్కొన్న డెరైక్టర్‌తోపాటు ప్రస్తుతం సీజీఎంలుగా పనిచేస్తున్న ఇద్దరు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. కంపెనీలోని మరో సీనియర్ డెరైక్టర్ కూడా సీఎండీ పోటీలో ఉన్నట్లు సమాచారం. జెన్‌కో తరహాలోనే ఎన్పీడీసీఎల్‌కు  ఈసారి ఐఏఎస్ అధికారిని కాకుండా ఇంజినీరింగ్, నాన్ ఐఏఎస్‌లకు సీఎండీ పోస్టు అప్పగించనున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

రాష్ట్ర స్థాయి నుంచి ఎన్పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్ సీఎండీలను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పలువురు అధికారులు సీఎండీ పోస్టుకు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా... సీఎండీ కార్తికేయ మిశ్రా బదిలీపై వెళ్లేందుకు ఇప్పటికే పలుమార్లు రిక్వెస్ట్ పెట్టుకున్నారని... ఈసారి ఎలాగైనా బదిలీ చేయించుకుంటారని.. లేనిపక్షంలో కొన్ని రోజులు సెలవులో వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తలు