ఏడుగురు ఐపీఎస్‌ అధికారుల బదిలీలు

1 Mar, 2019 04:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు హోంశాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ బదిలీల్లో ఇటీవల కొత్త జిల్లాలుగా ఆవిర్భవించిన నారాయణపేట, ములుగుకు పూర్తి స్థాయి ఎస్పీలను కేటాయించింది. దీంతో ఇంతకాలం అక్కడ ఇన్‌చార్జిగా విధులు నిర్వహిస్తోన్న అధికారులకు అదనపు బాధ్యతల నుంచి రిలీవ్‌ చేశారు.

బదిలీ అయిన వారి వివరాలు.
1. రోహిణి ప్రియదర్శిని (2012 ఐపీఎస్‌ బ్యాచ్‌)కి సైబరాబాద్‌ కమిషనరేట్‌లో క్రైమ్‌ డీసీపీగా పోస్టింగ్‌ ఇచ్చారు. 2. సుల్తాన్‌ బజార్‌ ఏసీపీగా ఉన్న చేతనాను నారాయణపేట్‌ ఎస్పీగా బదిలీ చేశారు. ఇప్పటిదాకా అక్కడ అదనపు విధులు నిర్వహిస్తోన్న రమారాజేశ్వరిని ఆ బాధ్యతల నుంచి రిలీవ్‌ చేశారు. 3. ప్రస్తుతం గోదావరిఖని ఏఎస్పీగా ఉన్న 2015 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన రక్షిత కె.మూర్తిని మంచిర్యాల డీసీపీగా బదిలీ చేశారు. 4. ప్రస్తుతం భద్రాచలం డీఎస్పీ గా ఉన్న 2015 బ్యాచ్‌కు చెందిన సంగ్రామ్‌ సింగ్‌ పాటిల్‌ గణపతిరావుకు ములుగు ఎస్పీగా పోస్టింగ్‌ ఇచ్చారు. ఇప్పటిదాకా ఎస్పీగా అదనపు బాధ్యతలు నిర్వహించిన భాస్కరన్‌ను రిలీవ్‌ చేశారు.

5. ప్రస్తుతం గ్రేహౌండ్స్‌ ఏఎస్పీగా ఉన్న 2016 బ్యాచ్‌కు చెందిన రాజేశ్‌ చంద్రను భద్రాచలం ఏఎస్పీగా బదిలీ చేశారు. 6. ప్రస్తుతం గ్రేహౌండ్స్‌ ఏఎస్పీగా ఉన్న 2016 బ్యాచ్‌ అధికారి శరత్‌ చంద్ర పవార్‌కు ఏటూరునాగారం ఏఎస్పీగా పోస్టింగ్‌ ఇచ్చారు. 7. ప్రస్తుతం గ్రేహౌండ్స్‌ ఏఎస్పీగా ఉన్న 2016 బ్యాచ్‌ అధికారి సాయి చైతన్య మహదేవాపూర్‌ (కాటారం) ఎస్డీపీవోగా బదిలీ చేశారు. అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆర్కే ప్రసాద్‌ను మరో చోటకి బదిలీ చేశారు. 

మరిన్ని వార్తలు