హవ్వ.. ఇదేం ట్రాక్!

25 Nov, 2015 01:29 IST|Sakshi

 ‘సాకి’లో నీటి ప్రవాహానికి అడ్డంగా నిర్మాణం
  చెరువు ఉనికికే ప్రమాదం
 జీహెచ్‌ఎంసీ అధికారుల చోద్యం

 
 పటాన్‌చెరు:లీడర్స్ డెరైక్షన్, అధికారుల యాక్షన్‌తో చెరువులను కాపాడాల్సిన పాలకులు చెరువు ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. చెరు వు కింద ఆయక ట్టే లేదు. రైతులు లేరు ఇక చెరువు ఎందుకన్న విధంగా పెద్దలు ప్రవర్తిస్తున్నారు. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో కొత్త వెంచ ర్లు వేసేందుకు ఉబలాట పడుతున్న వారికి జీహెచ్‌ఎంసీ అధికారులు, స్థానిక నాయకులు తోడ్పాటు నందిస్తుండటం గమనార్హం. కంచే చేను మేసిన విధంగా సాకి చెరువు పైభాగంలో ఇళ్ల నిర్మాణాలకే అనుమతులివ్వని జీహెచ్‌ఎంసీ ఇప్పు డు ఏకంగా వాకింగ్ ట్రాక్‌నే నిర్మిస్తున్నారు.
 
 సాకి చెరువులో నీటి ప్రవాహానికి అడ్డుగా వాకింగ్ ట్రాక్ నిర్మాణం సాగిస్తున్నారు. నిబంధనల మేరకు చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు జరగకూడదు. కాని జీహెచ్‌ఎంసీ అధికారులే దగ్గరుండి చెరువులో నీటి ప్రవాహానికి అడ్డుగా వాకింగ్ ట్రాక్ నిర్మించేందుకు మట్టి పోస్తున్నారు. సాకి చెరువుపై భాగంలో 30 ఏళ్ల క్రితం శాంతినగర్, శ్రీనగర్‌కాలనీలు వెలిశాయి. అప్పట్లో వెలసిన ఆ లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన చాలా మందికి జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారులు నేటికీ ఎఫ్‌టీఎల్ పేరుతో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదు.
 
 మట్టి పోస్తే జైలే..
 సాకి చెరువు శివారులో తన పొలంలో స్థానిక రైతు టప్ప కుమార్ అనే వ్యక్తి మట్టితో నింపారు. ఆయనపై స్థానిక రెవెన్యూ అధికారులు కేసులు పెట్టి, జైలుకు తరలించారు. అయితే జీహెచ్‌ఎంసీ అధికారులు మాత్రం చెరువులోకి వచ్చే నీటి ప్రవాహానికి అడ్డుగా శిఖం పరిధిలో మట్టి పోసి నిర్మాణాలు చేస్తున్నారు. దీని వెనుక స్థానిక లీడర్ల హస్తం ఉందని ఆరోపణలు వినవస్తున్నాయి. వాకింగ్ ట్రాక్ నిర్మిస్తే చెరువుకు హద్దు ఫిక్స్ చేసినట్టు అవుతుందని ఆ తరువాత ఎఫ్‌టీఎల్ పరిధిలో కొత్తగా వెంచర్ వేసి అమ్ముకోవాలని కొందరు ప్రణాళికలు వేస్తున్నారనే అనుమానాలున్నాయి. స్థానికుల అనుమానాలకు ఊతం ఇచ్చేలా జీహెచ్‌ఎంసీ అధికారుల సాకి చెరువు ఎఫ్‌టీఎల్, శిఖం భూమిలో నిర్మాణాలు చేయడం గమనార్హం. కంచే చేను మేసిన విధంగా చెరువును కాపాడాల్సిన అధికారులు చెరువు ఉనికికే ప్రమాదం తెచ్చే విధంగా నిర్మాణాలు సాగించడం విడ్డూరంగా ఉంది.
 
 సాకే చెరువు..
 కొన్ని వందల ఏళ్ల క్రితం వెలసిన సాకి చెరువుకు అసలు పేరు సాకే చెరువని.. ప్రస్తుతం  సాకి చెరువుగా రూపాంతరం చెందిందని చరిత్రకారుడు త్యార్ల మాణయ్య తన పుస్తకంలో లిఖించారు. రానురాను పటాన్‌చెరులో పంటలు వేయకపోవడంతో చెరువు అన్యాక్రాంతం అవుతూ వచ్చింది. చెరువు అలుగు వద్దే కబ్జాలున్నాయి. వాటిని తొలగించాలని డిమాండ్ ఉంది. 98 ఎకరాల విస్తీర్ణంతో చెరువు శిఖం భూమి ఉంది. దాదాపు 10 ఎకరాల భూమి పరిధిలో కబ్జాలు గతంలోనే జరిగాయి. తాజాగా మరో పది ఎకరాల భూమిలో కొత్త వెంచర్ వేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. దాని విలువ దాదాపు రూ.30 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు.
 
 అడ్డేమి లేదు
 పట్టణ పరిధిలోని సాకి చెరువులో మట్టి నింపుతున్న జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై ఆక్షేపణలు వ్యక్తం చేస్తూ పర్యావరణ ఉద్యమకారులు ఫిర్యాదు చేసినా జీహెచ్‌ఎంసీ అధికారుల నుంచి ఏ మాత్రం స్పందన లేదు. సాకి చెరువలో సాగుతున్న నిర్మాణంపై ‘సాక్షి’ జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ విజయ్‌కుమార్ వివరణ కోరగా చెరువులో జరగుతున్న పనులతో తమకే సంబంధంలేదని అది జీహెచ్‌ఎంసీ లేక్స్ విభాగం పరిధిలోకి వస్తాయని వారితో మాట్లాడాలని వివరణ ఇచ్చారు. ఇక ఆ లేక్స్ విభాగం పనులను, సాకి చెరువు నిర్మాణాలను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించే ఏఈ శేషగిరిరావును వివరణ కోరేందుకు పలకరిస్తే తానేమి మాట్లాడలేనంటూ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌తో వివరణ తీసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ఈ విషయమై ఫోన్‌లో జీహెచ్‌ఎంసీ ఈఈ (లేక్స్) శేఖర్‌రెడ్డి వివరణ కోరగా చెరువులో నిర్మాణాలేవీ నీటి ప్రవాహానికి అడ్డుగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టడంలేదని పేర్కొన్నారు. చెరువులో సుందరీకణ పనులు మాత్రమే చేస్తున్నామని చెప్పారు.
 

మరిన్ని వార్తలు