గుప్తనిధుల కోసం చిన్నారి హత్య

24 Jan, 2015 00:51 IST|Sakshi
గుప్తనిధుల కోసం చిన్నారి హత్య

* తల్లిని బంధించి, పాప గొంతునులిమి
* చంపిన దుండగులు
* మృతదేహం వద్ద నిమ్మకాయలతో పూజలు

యాలాల: గుప్త నిధుల కోసం ఓ చిన్నారిని బలిచ్చారు. తల్లిని తాళ్లతో బంధించి పాప గొంతు నులిమి ఈ దారుణానికి పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా యాలాల మండలం అక్కంపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అక్కంపల్లి గ్రామానికి చెందిన తుప్పల లక్ష్మి, భీములు దంపతులకు పూజ(1) అనే కుమార్తె ఉంది. అదే గ్రామానికి చెందిననర్సింహులు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టేవాడు.

గ్రామంలో పశువులను కూడా అపహరించేవాడు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి సమయంలో నర్సింహులు మరో వ్యక్తితో కలసి లక్షి్ష్మ ఇంట్లోకి చొరబడి ఆమెను తాళ్లతో బందించారు. ఆ తర్వాత  లక్షి్ష్మ తలపై రాయితో గట్టిగా మోదారు. అనంతరం నిద్రిస్తున్న పూజను ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి మెడలో ఉన్న దిష్టిదారంను గొంతుకు బిగించి చంపేశారు. పాప మృతదేహంపై నిమ్మకాయలు, పసుపు, బియ్యాన్ని మంత్రించి పూజలు చేశారు. లక్ష్మిని కూడా బయటకు తీసుకొచ్చి వాకిట్లో పడుకోబెట్టారు.

ఇంటికి దాదాపు పది అడుగుల దూరంలో మంటపెట్టి కొన్ని నిమ్మకాయలను కాల్చేసి పరారయ్యారు. శుక్రవారం ఉదయం ఇరుగుపొరుగు గమనించి లక్షి్ష్మని లేపారు. రాత్రి జరిగిన విషయాలను గుర్తుకు తెచ్చుకున్న ఆమె గ్రామస్తులకు వివరిం చింది. గుప్తనిధుల కోసమే చిన్నారిని బలిఇచ్చి ఉంటాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు