అండగా ఉంటాం..

15 Oct, 2014 02:21 IST|Sakshi
అండగా ఉంటాం..

దేవరకొండ/చందంపేట :  ‘‘అధైర్య పడొద్దు..అండగా ఉంటాం..’’ అంటూ ఆత్మహత్యకు పాల్పడిన గిరిజన రైతు కుటుంబానికి సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి భరోసా ఇచ్చారు. చందంపేట మండలం గాగిళ్లాపురం గ్రామపంచాయతీ కొర్రోనితండాకు చెందిన కౌలురైతు కొర్ర రూప్లానాయక్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడగా అతని కుటుంబాన్ని మంగళవారం సీఎల్పీ నేత జానారెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి పరామర్శించారు. రూప్లానాయక్ ఇంటికి వెళ్లిన కాంగ్రెస్ నేతలు అతని భార్య లచ్చిని ఓదార్చారు. ఆత్మహత్యకు పురికొల్పిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సాగుకు వ్యవసాయ భూమి లేక, బతకడానికి దారిలేక అప్పులబాధ ఎక్కువై ఆత్మహత్యకు పాల్పడినట్లు లచ్చి నాయకులతో తెలిపింది. స్పందిం చిన నాయకులు తక్షణ సాయంగా ఆమెకు రూ.50వేలు అందించారు. కాంగ్రెస్ హయాంలో ఆత్మహత్యకు పాల్పడిర కుటుంబానికి అందించే లక్ష రూపాయల ఆర్థికసాయాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేయకున్నప్పటికీ అధికారులతో ఈ విషయం మాట్లాడతానని జానారెడ్డి ఆమెకు హామీ ఇచ్చారు.
 
 రోడ్డుకు రూ.10 లక్షల జెడ్పీ నిధులు..
 తండాకు వెళ్లడానికి రోడ్డు మార్గం లేకపోగా జానారెడ్డి పర్యటన ఖరారు కాగానే కాంగ్రెస్ నాయకులు అప్పటికప్పుడు తాత్కాలిక రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయి రోడ్డు నిర్మాణం కోసం  ప్రస్తావించిన జానారెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డిలు జిల్లాపరిషత్ నిధుల నుంచి రూ. 10లక్షల వరకు కేటాయించాలని చైర్మన్ నేనావత్ బాలునాయక్‌ను కోరారు. దీనికి స్పం దించిన ఆయన అక్కడికక్కడే రోడ్డుకు నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు.  అదే విధంగా తండాలో తాగునీటి వసతి లేకపోవడంతో వ్యవసాయ బావి నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని, ట్రాన్స్‌ఫార్మర్ లేక ఇబ్బందులకు గురవుతున్నామని సమస్య పరిష్కరించాలని గిరిజనులు కోరారు.
 
  వెంటనే బోరును రిపేర్ చేయించి జెడ్పీ నిధుల కింద చేతిపంపు మంజూరు చేస్తామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, మండల పార్టీ అధ్యక్షుడు గోవిందు యాదవ్, దేవరకొండ ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, మైనార్టీ నాయకులు సిరాజ్‌ఖాన్, దేవరకొండ నగర పంచాయతీ చైర్మన్ కేతావత్ మంజ్యానాయక్, మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు సురేష్‌రెడ్డి, ముక్కమల్ల వెంకటయ్య, రవి, ఎంపీటీసీ వెంకటయ్య, బెరైడ్డి కొండల్‌రెడ్డి, లక్ష్మానాయక్, సర్పంచ్ కొత్తపల్లి కృష్ణ, ఎంపీటీసీ గిరి యాదగిరి, బిక్కునాయక్, నేనావత్ భరత్‌కుమార్, మహాలక్ష్మయ్య, కొర్ర రాంసింగ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు