ఆదివాసీల చిత్రకళకు ఊపిరి

10 Aug, 2018 04:06 IST|Sakshi
గురువారం మాసబ్‌ట్యాంక్‌లో ఆదివాసీలు గీసిన చిత్రాలను తిలకిస్తున్న మంత్రి చందూలాల్‌

గిరిజనుల సంస్కృతికి ప్రభుత్వం బాసట

ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఆదివాసీల చిత్రాలు

గిరిజన చిత్రకారుల పెయింటింగ్‌లకు ధరల నిర్ధారణ

సాక్షి, హైదరాబాద్‌: ఆదివాసీ తెగల సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటేందుకు గిరిజన సంక్షేమ శాఖ చిత్రకళను పునరుద్ధరిస్తోంది. ఇందులో భాగంగా ఆదివాసీ తెగల్లోని ఔత్సాహిక చిత్రకారులను ప్రోత్సహిస్తోంది. గత ఆర్నెళ్లుగా ఆదివాసీ తెగలకు చెందిన గోండు, కొలామీ, బంజార, కోయ వర్గాలకు చెందిన యువతను ఎంపిక చేసి పలు రకాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. తాజాగా ఈ చిత్రకారులు వేసిన చిత్రాలతో గురువారం మాసబ్‌ట్యాంక్‌లోని సెంటినరీ మ్యూజియం ఆవరణలో ప్రదర్శన ఏర్పాటు చేసింది.

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఇందు లో దాదాపు 50కి పైగా చిత్రాలను ఔత్సాహిక చిత్రకారులు ప్రదర్శించారు. ప్రతి ఆదివాసీ తెగకున్న ప్రత్యేకతను వెలుగులోకి తెచ్చేందుకు గిరిజన సంక్షేమ శాఖ చిత్రకళ పునరుద్ధరణకు ఉపక్రమించింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ని గిరిజనులు, ఆదివాసీల సంస్కృతికి సంబంధించి చిత్రకళ అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఆదివాసీ, గిరిజనుల సంస్కృతిని చిత్రాల రూపంలో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది.

ప్రతి కార్యాలయంలో పెయింటింగ్స్‌
ఆదివాసీ చిత్రకారుల చిత్రాలను ప్రతి ప్రభు త్వ కార్యాలయంలో ఉండేలా గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. దీంతో చిత్రకారులకు మంచి ఉపాధి లభించనుంది. ఇకపై రాష్ట్ర, జిల్లా కార్యాలయాల్లో ఆదివాసీ చిత్రాలు కనిపించనున్నాయి. ప్రైవేటువ్యక్తులు సైతం వీటిని కొనేందుకు వీలుగా ప్రత్యేకంగా ఎగ్జిబిషన్‌ల కోసం ఏర్పాట్లు చేస్తోంది.   డిమాండ్‌కు తగినట్లు ఔత్సాహిక చిత్రకారులకు సామగ్రిని యంత్రాంగం సరఫరా చేస్తోంది. 

మరిన్ని వార్తలు