శంకర్‌నాయక్‌ను నిలదీసిన రైతులు

16 Nov, 2018 10:57 IST|Sakshi
శంకర్‌నాయక్‌కు పట్టాదారు పాస్‌ పుస్తకాలు చూపుతూ అడ్డుకుంటున్న గ్రామస్తులు

రైతుబంధు, పట్టాదారు పాస్‌ పుస్తకాలు రాలేదని..

అయోధ్యలో తాజామాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ను నిలదీసిన గ్రామస్తులు

టీఆర్‌ఎస్‌ నాయకులు,రైతుల మధ్య తోపులాట ఎన్నికల ప్రచారంలో చిన్నారులు

సాక్షి, మహబూబాబాద్‌ : టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మానుకోట తాజామాజీ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌కు మానుకోట మండలంలోని అయోధ్య గ్రామంలో గురువారం రాత్రి తీవ్ర నిరసన సెగ ఎదురైంది. టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకర్‌నాయక్‌ అయోధ్య గ్రామానికి వెళ్లగా రైతులు, గ్రామస్తులు,  గ్రామ పొలిమేరలోనే అడ్డుకుని నిరసన తెలిపారు. ఎస్సీలకు ప్రభుత్వం అన్యాయం చేసిందని శంకర్‌నాయక్‌ను బాధిత రైతులు అడుగుతున్న సందర్భంలో  రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. అయినా గ్రామస్తులు తమకు రైతుబంధు, పట్టాదారు పాస్‌ పుస్తకాలు, పంట పెట్టుబడి సాయం రాలేదని శంకర్‌నాయక్‌ను నిలదీశారు.

ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో గ్రామంలోని దళితులకు ప్రభుత్వ భూమి ఇచ్చారని, వాటికి ఎందుకు రైతుబంధు, రైతుభీమా వర్తింపజేయలేదని ప్రజ లు ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఆ భూములకు ఎకరానికి లక్ష రూపాయల చొప్పున రుణాలు ఇచ్చారని, వాటిని మాఫీ కూడా చేశారన్నారు. అలాంటిది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం దళితుల పట్ల చిన్నచూపు చూస్తూ అన్యా యం చేసిందని బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకి మాధవరావు కలెక్టర్‌గా ఉన్న సమయంలో 400 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక్కొక్కరికి 4, 5 ఎకరాల చొప్పున ఇచ్చారని రైతులు తెలిపారు. సుమారు 70 ఏళ్లపైబడి నుంచి తమకు ఆ భూములపై పట్టాదారు పాస్‌ పుస్తకాలు కలిగి ఉన్నామని, ఆ భూమిపై ఆధారపడి జీవిస్తున్నామని తెలిపారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి దళిత రైతులను అక్కడ నుంచి పక్కకు పంపించారు. గ్రామంలో ప్రచారం అనంతరం వచ్చి ప్రజలకు సమాధానం చెబుతానని మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ చెప్పి వెళ్లారు. 

ఎన్నికల ప్రచారంలో చిన్నారులు
మహబూబాబాద్‌ మండలం అయోధ్య గ్రామంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోత్‌ శంకర్‌నాయక్‌ గురువారం సాయంత్రం నిర్వహించిన ఎన్నికల ప్రచా రంలో చిన్నారులు, స్కూల్‌ విద్యార్థులు టీఆర్‌ఎస్‌ కండువా, టోపీలు ధరించి ఎన్నికల ప్రచారంలో అభ్యర్థితో పాటు తిరిగారు. ఓటు హక్కులేని పిల్లలను ఎన్నికల ప్రచారంలో తిప్పకూడదనే నిబంధన ఉన్పటికీ పిల్లలను ప్రచారంలో తిప్పుతూ ఎన్నికల సంఘం నిబంధనలను శంకర్‌ నాయక్‌ తుంగలో తొక్కారు.  

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శంకర్‌నాయక్‌తో ఎన్నికల ప్రచారంలో పిల్లలు 

మరిన్ని వార్తలు