15న టీఆర్‌ఎస్‌ కార్యవర్గ సమావేశం 

14 Apr, 2019 05:09 IST|Sakshi

దిశా నిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో జరగనున్న జిల్లా పరిషత్, మండల పరిషత్‌ ఎన్నికలకు నాయకులను సన్నద్ధం చేసేందుకు ఈ నెల 15వ తేదీన టీఆర్‌ఎస్‌ విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. 15న తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశానికి రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, మాజీ మం త్రులు, ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులు, రాజ్యసభ సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులను ఆహ్వానించారు. పరిషత్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో విస్తృతంగా చర్చించడంతో పాటు పార్టీ నాయకత్వానికి కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

‘శాసించి నిధులు తేవాలన్నదే సీఎం తపన’
సాక్షి, హైదరాబాద్‌: కేం ద్రాన్ని యాచించకుం డా, శాసించి నిధులు సాధించుకోవాలన్నదే సీఎం కేసీఆర్‌ తపన అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నెల రోజుల తర్వాత దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ కీలకపాత్ర పోషిస్తారని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేదల గుండెల్లో కేసీఆర్‌ ఉంటే.. యువత గుండెల్లో కేటీఆర్‌ ఉన్నారని పేర్కొన్నారు. 

 

మరిన్ని వార్తలు