కాంగ్రెస్‌కు ఓటేస్తే మోరీలో వేసినట్లే

10 Mar, 2019 02:04 IST|Sakshi

రోజురోజుకూ మోదీ మీటర్‌ పడిపోతోంది

ఈసారి ఎన్డీయేకు 160 సీట్లు కూడా రావు 

చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ భేటీలో కేటీఆర్‌

283 సీట్లిస్తే ఏంచేశారంటూ మోదీపై మండిపాటు 

మోదీ, రాహుల్‌ మధ్యనే పోరు అనుకుంటే వెర్రితనమే

16 సీట్లతో కేంద్రం మెడలు వంచుతామని ప్రకటన

సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక ఎన్నికల్లో పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే అది మోరీలో వేసినట్లేనని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ మీటర్‌ దేశవ్యాప్తంగా రోజురోజుకూ డౌన్‌ అవుతోందని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవన్నారు. శనివారం చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ సన్నాహక సమావేశం.. పట్టణంలోని ఫరా కళాశాల మైదానంలో జరిగింది. ఈ సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. మోదీ సారథ్యంలోని ఎన్‌డీఏకు పార్లమెంట్‌ ఎన్నికల్లో 160 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు. యూపీఏ పరిస్థితి కూడా అంతకంటే గొప్పగా ఏమీలేదన్నారు. ఈ కూటమికి నూరు సీట్లు దాటవన్నారు.

ఈ రెండు పార్టీలు కలిసినా 270 సీట్లకు మించవని ఆయన చెప్పారు. దేశాన్ని ఉద్ధరిస్తారని 2014 ఎన్నికల్లో మోదీకి దేశమంతా ఓట్లేసి 283 సీట్లతో గెలిపిస్తే చేసిందేమీ లేదన్నారు. ఐదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే దేశంలోని సామాన్యులు, పేదవాళ్లకు, మహిళలకు, యువకులకు శుష్కప్రియాలు, శూన్యహస్తాలు తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు. మోదీ మాటలు జోరుగా ఉంటాయే తప్ప చేతలు గడప కూడా దాటలేదని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌ ఎన్నికలు మోదీకి, రాహుల్‌ గాంధీకి మధ్యనే జరుగుతున్నాయని అనుకుంటే అంతకు మించిన వెర్రితనం మరొకటి లేదన్నారు. ఈ రెండు పార్టీలకే ఓటు వేయాల్సిన ఖర్మ దేశ ప్రజలకు పట్టలేదన్నారు. 

24 పైసలూ ఇవ్వలేదు 
నీటి వనరుల పరిరక్షణ చేస్తున్న మిషన్‌ కాకతీయ పథకానికి రూ.5వేల కోట్లు, ఇంటింటికీ నీరందిస్తున్న మిషన్‌ భగీరథకు రూ.19వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేస్తే కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. మొత్తం రూ.24 వేల కోట్లలో.. కనీసం 24 పైసలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఎంపీ సీటూ కీలకమేనన్నారు. ఒక్క సీటు ఎంఐఎంకు పోయినా 16 ఎంపీ సీట్లతో ఢిల్లీలో మెడలు వంచే సత్తా టీఆర్‌ఎస్‌కు ఉంటుందన్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టు మాదిరిగా తెలంగాణలో కాళేశ్వరానికిగానీ, పాలమూరు ఎత్తిపోతల పథకానికైనా జాతీయహోదా ఇవ్వాలని గతంలో మోదీని కేసీఆర్‌ కోరారని గుర్తుచేశారు. దీనిపై ఎన్నోసార్లు ఉత్తరాలు రాశామని, నేరుగా కలిసి విజ్ఙప్తి చేస్తే మోదీ ముసిముసి నవ్వులు నవ్వారే తప్ప.. జాతీయ హోదా ఇవ్వలేదన్నారు.  

భావసారూప్య పార్టీలకు 100 సీట్లొస్తే.. 
వచ్చే ఎన్నికల్లో మనం ఇచ్చే తీర్పుతో 16 సీట్లు మన చేతిలో ఉంటాయన్నారు. దీనికితోడు దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌ అంటే పొడగిట్టని, భావసారూప్యత గల ప్రాంతీయ పార్టీలు కలిసి.. 100 ఎంపీ సీట్లు సాధిస్తే ఎర్రకోటపై ఎవరు జెండా ఎగురవేయాలో తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. దీంతో పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా రాదా అని ప్రజలను అడిగారు. ఎంపీ సీట్లు లేకున్నా పార్టీ నడుస్తదని, ఎటువంటి నష్టం లేదన్నారు. అయితే ఎంపీ సీట్లు గెలిస్తే ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి రూ.1.50 లక్షల కోట్ల వరకు నిధులు వస్తాయన్నారు. ఇది సాధ్యం కావాలంటే పేగులు తెగేలా పోరాడే టీఆర్‌ఎస్‌ బిడ్డలు కావాలన్నారు. మళ్లీ కాంగ్రెస్‌ అభ్య ర్థులు గెలిస్తే.. అన్నింటికీ మళ్లీ ఢిల్లీ వెళ్లాల్సిందేనన్నారు. ఆ పార్టీకి పొరపాటున ఓటు వేసినా మోరీలో పడినట్లేనని చెప్పారు. యాచించకుండా ఢిల్లీని శాసించాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలన్నారు.

బడిత ఉన్నోడిదే రాజ్యమన్నారు. కేంద్రంలో మంత్రులుగా పనిచేసిన మమతా బెనర్జీ రైళ్లను పశ్చి మ బెంగాల్‌కు తీసుకెళ్లారని, లాలూ ప్రసాద్‌యాదవ్‌ తన అత్తగారింటికి కూడా మార్గా లు వేసుకున్నాడని ఎద్దేవా చేశారు. ప్రస్తుత బీజేపీ హయాంలో బుల్లెట్‌ రైలు ఢిల్లీ నుంచి గుజరాత్‌ మీదుగా ముంబైకి వెళ్లినా తెలంగాణ దిక్కు మాత్రం చూడలేదన్నారు. ఇక్కడ ఓట్లు, సీట్లు లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. వచ్చే ఎన్నికల్లో 16 సీట్లు గెలిచి కేసీఆర్‌ చేతుల్లో పెడితే.. ఇవే కీలకమవుతాయన్నారు. అప్పుడు తెలంగాణకూ హైస్పీడ్, బుల్లెట్‌ రైళ్లు వస్తాయని చెప్పారు. కేంద్రంలో నిర్ణయాత్మక స్థాయిలో మనవాళ్లు ఉంటే అవే తన్నుకుంటూ రాష్ట్రానికి వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, పారిశ్రామికవేత్త రంజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

16 స్థానాల్లో గులాబీ జెండా 
సాక్షి, నాగర్‌కర్నూల్‌: రాష్ట్రంలో 16 లోక్‌సభ స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. శనివారం వనపర్తిలో నాగర్‌కర్నూల్‌ పార్లమెంటరీ నియోజకవర్గం ఎన్నికల సన్నాహక సభ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్‌ మాట్లాడుతూ మూడు పర్యాయాలుగా నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గాన్ని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోలేకపోయిందని, ఈసారి ఆ పొరపాటు జరగకుండా గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. దేశంలోనే ఆదర్శవంతమైన పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆలోచన దేశంలోనే ఆచరణీయంగా మారిందన్నారు.

గతంలో ఎంతమంది సీఎంలు పనిచేసినా ఎవరూ రైతాంగాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని పేర్కొన్నారు. అయితే కేసీఆర్‌ స్వయంగా రైతు కావటం వల్ల, చిన్నప్పటి నుంచి రైతుల కష్టాలను చూసిన వాడిగా విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేపట్టారన్నారు. రాష్ట్రంలో రెండో హరిత విప్లవానికి నాంది పలికే విధంగా రైతుబంధు వంటి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. ఈ సభలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అబ్రహం, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కర్నె ప్రభాకర్, శాసనమండలి విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

బోఫోర్స్‌..లేదంటే రఫేల్‌! 
రాహుల్‌ గాంధీనో, మోదీనో ప్రధానిగా ఉండాలంటే తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోరన్నారు. ‘మోదీ మాట్లాడితే బోఫోర్స్‌ అంటాడు. రాహుల్‌ గాంధీ రఫేల్‌ కుంభకోణం అంటున్నాడు. 71 ఏళ్లలో అయితే వాళ్లు (కాంగ్రెస్‌).. లేకపోతే వీళ్లు (బీజేపీ) అన్నట్లుగా ఎంతమంది ప్రధానులు వచ్చినా అన్ని వర్గాల అభివృద్ధి జరగలేదు. స్వతంత్ర భారతంలో ఏ పీఎం, సీఎంకు రాని ఆలోచన కేసీఆర్‌కు వచ్చిందన్నారు. రైతులు కాలర్‌ ఎగరేస్తూ గర్వంగా చెప్పుకునేలా రైతుబంధు, రైతుబీమా పథకాలను తీసుకొచ్చిన ఏకైక సీఎం కేసీఆర్‌’అని కేటీఆర్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌ ఆలోచన దేశానికే ఆచరణగా మారిందన్నారు. ప్రధానులవుతామని ఆÔ¶శల పల్లకిలో ఊగుతున్న మోదీకి, రాహుల్‌కు ఇటువంటి ఆలోచనలు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.
 

మరిన్ని వార్తలు