అవినీతి టీఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదు..

19 Nov, 2018 09:30 IST|Sakshi
మాట్లాడుతున్న జగదీశ్వర్‌రావు

సాక్షి, పెంట్లవెల్లి: కొల్లాపూర్‌లో హర్షవర్ధన్‌రెడ్డి గెలుపు కోసం కృషిచేస్తామని కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు మతీన్‌ అహ్మద్‌ అన్నారు. ప్రతిరోజూ ఇంటింటికి తిరిగి వైఎస్‌ హయాంలో చేపట్టిన పథకాలను వివరిస్తున్నామని, రాబోయే కాలంలో కాంగ్రెస్‌ గెలవడం ఖాయమన్నారు. బీరం హర్షవర్ధన్‌రెడ్డి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. జూపల్లి కృష్ణారావు ఎన్ని మాయమాటలు చెప్పినా ఈ సారి కాంగ్రెస్‌ గెలవడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో చూసి ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. కార్యక్రమంలో రామకృష్ణ, కుర్మయ్య, రఫియోద్దీన్, బీసీ రామకృష్ణ, పాల్గొన్నారు. 


పెద్దకొత్తపల్లి: కాంగ్రెస్‌ అధిష్టానం కార్యకర్తలకు భరోసా ఇస్తేనే పార్టీకి పని చేస్తామని సీనియర్‌ నాయకులు జగదీశ్వర్‌రావు అన్నారు. ముష్టిపల్లిలో ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధిష్టానం నిర్ణయం ప్రకారం టిక్కెట్‌ ఇచ్చిన వారి గెలుపు కోసం పని చేస్తామని, స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని భరోసా ఇస్తేనే కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు కోసం పని చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, నాగరాజు, రాజశేఖర్, వెంకట్‌రెడ్డి, నాగరాజుగౌడ్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 


పాన్‌గల్‌: పేదల సంక్షేమమే ద్యేయంగా కాంగ్రెస్‌ పార్టీ మెనిఫెస్టోను రూపొందించిందని పీసీసీ సభ్యులు రాంమూర్తినాయుడు, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్‌ అన్నారు. ఆదివారం మండలంలోని మల్లాయిపల్లి, పాన్‌గల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ కంటే ముందుగానే విడుదల చేసిన కాంగ్రెస్‌ మెనిఫెస్టోను అపహస్యం చేసిన టీఆర్‌ఎస్‌ నాయకులు అదే మెనిఫెస్టోను కాఫీ కొట్టి పథకాలల్లో కేవలం రూ.16 జతపరిచి మెనిఫెస్టోను ప్రకటించుకోవడం సిగ్గుచేటున్నారు. పార్టు–బిలో ఉంచిన సర్వేనెంబర్లతో వేల మంది రైతులకు రైతుబందు పథకానికి అనర్హులుగా మిగిలిపోయారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఎన్నో హామీలను విస్మరించిందన్నారు. 


టీఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదు 
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ, నిరుద్యోగ భృతి, రేషన్‌ ద్వారా సన్నబియ్యం, ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు వంటి పథకాలు అమలు చేస్తారన్నారు.

కాంగ్రెస్‌ మెనిఫెస్టో కరపత్రాలను ఇంటింటికి పంచుతూ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రఘుపతినాయుడు, యుగంధర్‌గౌడు, మండల పార్టీ అధ్యక్షులు వెంకటయ్యనాయుడు, మాజీ సర్పంచు రమేష్‌బాబు, మాజీ ఎంపీటీసీ బుచ్చారెడ్డి, నాయకులు రాముయాదవ్, శ్రీధర్‌రెడ్డి, సుబ్బయ్యయాదవ్, శేషయ్య పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు