బడ్జెట్పై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు
ఆసరా పెన్షన్లు, రైతు బంధు పెంపు
రుణ మాఫీ అమలుకు నిధుల కేటాయింపు
నిరుద్యోగ భృతి, ఉద్యోగుల రిటైర్మెంట్పై ప్రకటన
ఐదారు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు కసరత్తు చేస్తున్నారు. ‘ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి’నినాదంతో తమ ప్రభుత్వం పని చేస్తోందంటూ తరచూ చెప్పే సీఎం కేసీఆర్ త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో దీన్ని ప్రతిబింబించాలని భావిస్తున్నారు. ఈసారి ప్రవేశపెట్టేది తాత్కాలిక బడ్జెటే అయినా ఎన్నికల హామీల అమలుకు అవసరమైన నిధుల కేటాయింపు, విధాన ప్రకటనలను ఇందులో పొందుపరచడం ద్వారా త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లకుగాను 16 సీట్లను గెలుచుకోవాలనుకుంటున్నారు. ఎన్నికల హామీల అమలుకు అవసరమైన నిధుల లెక్కలను ఆర్థికశాఖ ఇప్పటికే సిద్ధం చేసింది. ఫిబ్రవరి 20 తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే పరిస్థితుల నేపథ్యంలో ఐదారు రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలను ముగించాలని సీఎం భావిస్తున్నారు.
టీఆర్ఎస్ ఎన్నికల హామీలివే..
ఒక్కొక్కటిగా అన్నీ...
ఎన్నికల హామీల అమలు విషయంలో సీఎం కేసీఆర్ అన్ని పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకొని వెంటనే అమలు చేసే హామీలు ఏమిటనే జాబితా రూపొందిస్తున్నారు. హామీల అమలు విషయంలో టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతామని పేర్కొంది. ఈ హామీ వల్ల నిరుద్యోగుల్లో అసంతృప్తి తలెత్తకుండా నియామక వయోపరిమితిని మూడేళ్లు పెంచనున్నట్లు హామీ ఇచ్చింది. పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ను ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు సముచిత రీతిలో వేతన సవరణపై నిర్ణయం తీసుకుంటామని, నిరుద్యోగలకు రూ. 3,016 భృతి చెల్లిస్తామని ప్రకటించింది. ఉద్యోగుల విషయంలో బడ్జెట్లోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.