పథకాల అమలులో ప్రభుత్వం విఫలం

31 Mar, 2018 06:52 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న జాదవ్‌ అనిల్‌కుమార్‌

కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి జాదవ్‌ అనిల్‌కుమార్‌

నేరడిగొండ : పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి జాదవ్‌ అనిల్‌కుమార్‌ ఆరోపించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన వారికి డబుల్‌ బెడ్‌రూమ్, దళితులకు మూడెకరాల భూమి అని ఎన్నో పథకాలను అమలు చేస్తామని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి నేటికీ ఒక్కటికూడా అమలు చేయలేదని మండిపడ్డారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలు మాత్రం తమ కమీషన్ల కోసం అమలు చేస్తూ మిగితా వాటిని మరిచిపోయారని విమర్శించారు. గ్రామాల్లో పలు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కార్యకర్తల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

మార్కెట్‌యార్డులో కందులు అమ్మిన రైతులకు నేటికీ డబ్బులురాక ఆందోళన చెందుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. ఇప్పుడు శనగపంటను అమ్ముదామన్నా రైతులకు ఇబ్బందులే ఉన్నాయన్నారు. ‘డబుల్‌’ ఇళ్ల నిర్మాణంలో  టీఆర్‌ఎస్‌ నాయకులు లబ్ధిదారుల వద్దనుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని, త్వరలోనే జిల్లా కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ను కలిసి ఈ విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఈ సమావేశంలో బోథ్‌ మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ అల్లూరి ప్రపుల్‌చందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల కన్వీనర్‌ సాబ్లే నానక్‌సింగ్, నాయకులు ఏలేటి రాజశేఖర్‌రెడ్డి, ఆడె వసంత్‌రావు, సాబ్లే ప్రతాప్‌సింగ్, గులాబ్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు