సాక్షి, హైదరాబాద్ : ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ పర్యటనలో అపశృతి దొర్లింది. ఎల్బీనగర్ నియోజకర్గ టీఆర్ఎస్ ఇన్చార్జ్ ముద్దగోని రామ్మోహన్ గౌడ్ స్వల్పంగా గాయలపాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే నగరంలోని ఎల్బీ నగర్ నియోజకవర్గం వనస్థలిపురం, బీఎన్రెడ్డి ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ శుక్రవారం పర్యటించారు. ఈసందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలతో పెద్ద ర్యాలీ జరిగింది.
పర్యటనలో కేటీఆర్ కాన్వాయ్ ముందుకు వెళ్తుండగా స్వల్ప ప్రమాదం జరిగింది. ముద్దగోని రామ్మోహన్ గౌడ్ ప్రయాణిస్తున్న వాహనం, ముందు ఉన్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామ్మోహన్ గౌడ్ చేతికి స్వల్పగాయం తగిలి రక్తస్రావం అయ్యింది. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో కారు అద్దాలు పగిలిపోయాయి.