నీటి ఎద్దడికి పొన్నాలే కారణం

2 Nov, 2018 13:42 IST|Sakshi

నీళ్ల మంత్రిగా ఉండి ఆంధ్రనాయకులతో కుమ్మక్కు

ఎన్నికల ప్రచారంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

వరంగల్ / నర్మెట: ‘తెలంగాణలో నీటి ఎద్దడికి పొన్నాలే కారణం.. ఆనాడు భారీ నీటి పారుదల శాఖామంత్రిగా ఉండి ఆంధ్రా నాయకులతో కుమ్మక్కై తెలంగాణ రైతులకు తీరని ద్రోహం చేశాడు’ అని తాజా మాజీ ఎమ్మల్యే, టీఆర్‌ఎస్‌ జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి «అన్నారు. మండలంలోని అమ్మాపూర్‌లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం సాగించిన పొన్నాల దేవాదుల నిర్మాణంలో తక్కువ వ్యాసం కలిగిన పైపులైన్ల వినియోగంతో  తెలంగాణకు తీరని అన్యాయం చేశాడని దీంతో  నీటిపంపింగ్‌ సామర్థ్యం తగ్గడంతో చెరువులు, కుంటలు నింపడం ఆలస్యమవుతోందన్నారు.

 వెచ్చించిన వేలకోట్ల ప్రజాధనం వృథాచేసి కరువుకు కారణమైన లక్ష్మయ్యను గ్రామాల్లోకి రాకుం డా అడ్డుకుని ఓటు ఆయుధంతో గుణపాఠం చెప్పాలన్నారు. సాగు,తాగునీటికి అలమటిస్తున్న తెలంగాణకు ఒక్కపైసా ఇవ్వనన్న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డికి ప్రజల ఉసురు తాకి పత్తాలేకుండా పోయాడని, పొన్నాల ఓటమి పాలయ్యాడన్నారు. మహిళలు బోనాలు, బతుకమ్మలతో ముత్తిరెడ్డికి స్వాగతం పలకగా ఆయన వారితో కలిసి బతుకమ్మ ఆడారు. గుండెపోటుతో ఇటీవల మృతిచెందిన పార్టీ నాయకుడు పెద్ద చంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని ఓదార్చారు.

 అనంతరం టీడీపీకి చెందిన వంద మంది నాయకులు, కార్యకర్తలు పిట్టల రాజు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరగా వారికి ముత్తిరెడ్డి కండువా కప్పి స్వాగతించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ పెద్ది రాజిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఎండీ గౌస్, టీఆర్‌ఎస్వీ జిల్లా కన్వీనర్‌ వంగ ప్రణీత్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు దేవరాయ కనకయ్య, కుంటి లక్ష్మయ్య, మాజీ ఎంపిటీసి చెక్కిల్ల నర్సమ్మ, చెక్కిల్ల రవీందర్‌ దంపతులు, బండి నర్సింహారెడ్డి, లక్ష్మారెడ్డి, ఇర్రి గాల్‌రెడ్డి, బుచ్చాల గాలయ్య, మండల యూత్‌ నాయకులు పార్నంది సతీష్‌ శర్మ, శశిరథ్, రవి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు