తారస్థాయికి..అసమ్మతి రాగం!

13 Sep, 2018 10:22 IST|Sakshi
మిర్యాలగూడలో నిర్వహించిన ప్రదర్శనలో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌ అసమ్మతి నేత అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి

మిర్యాలగూడ నియోజకవర్గంలో బుధవారం అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి భారీ ర్యాలీ.. నార్కట్‌పల్లిలో దుబ్బాక నర్సింహారెడ్డి, మరికొందరు నేతలతో కలిసి సన్నాహక సమావేశం.. మునుగోడులో వేనేపల్లి వెంకటేశ్వరరావు, నాగార్జునసాగర్‌లో ఎంసీ కోటిరెడ్డి కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు.. ఇదీ.. జిల్లాలో రెండు, మూడు రోజులుగా ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడిన టీఆర్‌ఎస్‌ అసమ్మతి నేతల హడావుడి. 

సాక్షిప్రతినిధి, నల్లగొండ : టీఆర్‌ఎస్‌లో రోజు రోజుకూ పెరిగిపోతున్న అసమ్మతి రాజకీయం ఆ పార్టీ నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పది స్థానాలకు టికెట్లను ఖరారు చేశారు. నల్లగొండలో కొత్తగా ఇన్‌చార్జ్‌ బాధ్యతలు తీసుకున్న కంచర్ల భూపాల్‌రెడ్డిని మినహాయిస్తే మిగిలిన తొమ్మిది స్థానాల్లో ఎని మిది మంది సిట్టింగులే ఉన్నారు. నాగార్జునసాగర్‌లో గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన ఇన్‌చార్జి నోముల నర్సింహయ్యకే టికెట్‌ ఇచ్చారు.

కోదాడ, హుజూర్‌నగర్‌లో అభ్యర్థుల ఖరారు పెండింగులో ఉంది. కాగా, ఈ స్థానాల్లో వేనేపల్లి చం దర్‌రావు, శంకరమ్మ పేర్లనే ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో టికె ట్లు ప్రకటించిన నియోజకవర్గాల్లో సగానికి సగం స్థానాల్లో అసమ్మతి రాజకీయాలు నడవడం ఆ పార్టీ నాయకత్వాన్ని కలవరానికి గురిచేస్తోంది. టికెట్లు ప్రకటించిన మరుసటి రోజు నుం చే దేవరకొండ, నాగార్జున సాగర్, మునుగోడు, తుంగతుర్తి, నల్లగొండ, మిర్యాలగూడలో అసమ్మతి నేతల రాగాలు మొదలయ్యాయి. దేవరకొండకు చెందిన జెడ్పీ చైర్మన్‌ బాలూ నాయక్‌ తన దగ్గరి నేతలతో హైదరాబాద్‌లో భేటీ అయ్యి సమాలోచనలు జరిపారు.

నాగార్జున సాగర్‌ నాయకులు ఎంసీ కోటిరెడ్డి నేతృత్వంలో హైదరాబాద్‌లో తేరా చిన్నపరెడ్డి ఇంటిలో భేటీ అయ్యారు. అక్కడ తీసుకున్న నిర్ణయం మేరకు హాలియా మార్కెట్‌ యార్డులో నోముల నర్సిం హయ్య అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా పెద్ద సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత నియోజకవర్గం లోని మెజారిటీ ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు మీడియా ముం దుకు వచ్చి స్థానికేతరుడైన నోములకు టికెట్‌ ఇవ్వొద్దని డిమాండ్‌ చేశారు. ఒక వేళ బీసీ కోణంలో ఆలోచిస్తే, నియోజకవర్గంలోనే సమర్థులైన బీసీ నేతలు ఉన్నారని, వారి అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హాలియా సమావేశంలో తీర్మానించారు. ఇక, మిర్యాలగూడలో ఆ పార్టీ సీనియర్‌ నేత అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి వర్గం భాస్కర్‌రావు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తోంది.

బుధవారం ఆయన ర్యాలీ నిర్వహించడమే కాకుండా  సమావేశం కూడా జరిపి భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. తుంగతుర్తిలో అభ్యర్థి గాదరి కిశోర్‌ కుమార్‌ను స్థానికేతరుడని పక్కన పెట్టాలన్న డి మాండ్‌తో అసమ్మతి సమావేశం జరిగింది. మునుగోడులో తాజా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి అభ్యర్థిత్వాన్ని అక్కడి నేతలు వ్యతిరేకిస్తున్నారు. పార్టీ నాయకుడు వేనేపల్లి వెంకటేశ్వరరావు నేతృత్వంలో వీరంతా ఇప్పటికే హైదరాబా ద్‌లో సమావేశమై చర్చించారు. నల్లగొండ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డికి పార్టీ సీనియర్లనుంచి సహా య నిరాకరణ మొదలైంది. ఆయనకు కాకుండా, సీని యర్లలో ఎవరికి టికెట్‌ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని అసమ్మతి నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఓ మారు చకిలం అనిల్‌కుమార్‌ సమావేశం జరిపి తాను పోటీలో ఉంటానని ప్రకటించారు.

ఏడాది కిందటి దాకా ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన దుబ్బాక నర్సింహారెడ్డి నేతృత్వంలో బుధవారం నార్కట్‌పల్లిలో సన్నాహక సమావేశం జరిపారు. సోమవారం జిల్లా కేంద్రం లోని ఎన్జీ కాలేజీ మైదానంలో అసమ్మతి సభ జరపాలని నిర్ణయించారు. నల్లగొండ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, తిప్పర్తి జెడ్పీటీసీ సభ్యుడు తండు సైదులు గౌడ్, కౌన్సిలర్లు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముందునుంచీ పార్టీలో ఉన్న సీనియర్లను గౌరవించి టికెట్‌ ఇవ్వాలన్నది అసమ్మతి నేతల డిమాండ్‌గా ఉంది. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల్లో అసమ్మతి రాజకీయం జోరుగా సాగుతోంది. 

తారస్థాయికి..అసమ్మతి రాగం! 

మరిన్ని వార్తలు